సుబేదారి, జూన్ 16: సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మల్టీ మార్కెటింగ్ పేరుతో బోగస్ కంపెనీ స్థాపించి కోట్లు వసూలు చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వరంగల్ పోలీసు కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ తిలక్రోడ్డు కాశీబుగ్గకు చెందిన బొనగాని రాజుగౌడ్, వరంగల్లోని రంగంపేటకు చెందిన బొమ్మగాని మల్లేశం, హనుమకొండ జూలైవాడకు చెందిన మోటపోతుల వెంకటేశ్గౌడ్ కలిసి ఈఎస్పీఎన్ ఒరాకిల్ పేరిట బోగస్ కంపెనీ స్థాపించారు. షేర్ మార్కెటింగ్ పేరుతో చాలామంది నుంచి సభ్యత్వ రుసుం కింద 4 వేలు తీసుకొని, సభ్యుల నుంచి షేర్ మార్కెటింగ్ పేరుతో నెలకు రూ.2.64 లక్షల చొప్పున మొత్తం రూ. 1.67 కోట్లు వారి సొంత ఖాతాల్లో జమ చేసుకొన్నారు. ఈ డబ్బుతో వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని ఖానాపూర్ వద్ద 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెంచర్ వేశారు. సభ్యులకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. పోలీసులు పక్కా సమాచారంతో బొనగాని రాజు గౌడ్, బొమ్మగాని మల్లేశంను అరెస్ట్చేసి రూ.10.50 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకొన్నారు. మరో నిందితుడు వెంకటేశ్గౌడ్ పరారీలో ఉన్నాడు.