హైదరాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని టీహబ్లో ఏర్పా టు చేస్తున్న ఫ్రాన్స్ కాన్సులేట్-హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు కాన్సుల్ జనరల్-బెంగళూరు థెయిరీ బెర్తెలోట్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి వివరించారు.
పెట్టుబడులకు టెలీ పెర్ఫార్మన్స్ కంపెనీ ఆసక్తి
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ టెలీ పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి శ్రీధర్బాబును సచివాలయంలో కలిశారు. ఈ నెల 5 నుంచి 8 వరకు ఐటీసీ కోహినూర్లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్కు అతిథిగా రావాలని మంత్రిని వారు ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికిపైగా ఉద్యోగులు, 300పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి వివరించారు. త్వరలోనే హైదరాబాద్తోపాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లోనూ తాము తమ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లాంబా చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయసహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.