అమరావతి : విజయవాడలోని దుర్గమ్మ సన్నిధిలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. నిన్న అమ్మవారి దర్శనానికి వచ్చిన సదరు కుటుంబం.. కన్యకా పరమేశ్వరి సత్రంలోని ఓ గదిలో దిగారు. సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా తండ్రి, మరో కుమారుడు ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గల్లంతైన వీరిద్దరి కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
వీరిని నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేశ్ , పప్పుల శ్రీలత, పప్పుల అఖిల్ కుమార్, పప్పుల ఆశీష్గా పోలీసులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి శ్రీలత, కొడుకు ఆశీష్లు గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకోగా తండ్రి సురేశ్, కుమారుడు అఖిల్కుమార్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నిజామాబాద్లోని బంధువులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు కన్యకాపరమేశ్వరి సత్రం వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే సురేశ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని తెలుస్తోంది. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్కు చెందిన సురేశ్.. మెట్పల్లి జిల్లా నుంచి మూడు దశాబ్దాల క్రితం వలస వచ్చారు. సురేశ్ నగరంలో మెడికల్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు విస్తరణలో భాగంగా మెడికల్ షాపు పోయింది. ఈ క్రమంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్లు, వ్యక్తుల వద్ద రుణాలు పొంది బాకీ పడ్డట్లు తెలుస్తోంది. సురేశ్ నివాసముంటున్న ప్లాట్ను కూడా సీజ్ చేసినట్లు సమాచారం.