ముస్తాబాద్, మార్చి 28: ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని పీపుల్స్ దవాఖానలో చోటుచేసుకున్నది. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కుల లావణ్య రెండో కాన్పు కోసం ముస్తాబాద్లోని పీపుల్స్ దవాఖానలో చేరింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్టు గుర్తించారు. లావణ్యకు శస్త్ర చికిత్స చేసి ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు పురుడుపోశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, ఒక్కో శిశువు కిలో వరకు బరువు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తల్లి గర్భంలో నాలుగు పిండాలు ఏర్పడటం చాలా అరుదైన అంశమని వారు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం శిశువులను సిద్దిపేటలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు చెప్పారు. లావణ్యకు ఇప్పటికే తొమ్మిదేండ్ల బాబు ఉన్నాడు.