హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నాలుగు బ్యాం కింగ్ ఫ్రాంటియర్స్ అవార్డులను గెలుచుకొన్నది. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సమ్మిట్ (ఎన్సీబీఎస్), ఫ్రాంటియర్స్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అవార్డ్స్ (ఎఫ్సీబీఏ) నేతృత్వంలోని బ్యాంకింగ్ ఫ్రాంటియ ర్స్ శనివారం సాయంత్రం వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ షాజీ కేవీ, నాఫ్కాబ్ (ఎన్ఏఎఫ్సీయూబీ) అధ్యక్షుడు జ్యోతింద్ర మెహతా, కేంద్ర ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్ అవార్డులను అందజేశారు. చైర్మన్ కొండూరు రవీందర్రావు నేతృత్వంలోని టెస్కాబ్ ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ ఎన్ఏపీ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడి చొరవ, ఉత్తమ్ హెచ్ఆర్ ఆవిష్కరణ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకొన్నది. దీనిపై టెస్కాబ్ ఎండీ డాక్టర్ ఎన్ మురళీధర్ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సైతం ఎంతో అంకితభావంతో పనిచేసి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టెస్కాబ్ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.