హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): పులి చర్మాన్ని, గోళ్లను తరలిస్తున్న నలుగురు నిందితులను ములుగు ఫారెస్ట్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని తాడ్వాయి కోడిశాల సమీపంలో తనిఖీలు జరుపుతున్న పోలీసులకు సీజీ 17 సీ0535 నంబర్ అంబాసిడర్ కారులో వీరు పట్టుబడ్డారు. నిందితులను మద్కం సురేశ్ (25), మాదవి ఎరుమయ్య (24), మడకం ముఖేశ్ (42), మాదవి దేవ (23)గా గుర్తించారు. వీరినుంచి పులి గోళ్లు, చర్మం స్వాధీనం చేసుకున్నా రు. పోడు వ్యవసాయంతో వచ్చే ఆదాయం సరిపోక జంతువులను వేటాడి వాటి మాంసం, చర్మాన్ని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. పులిని గుర్తించాక ఉచ్చువేసి చంపినట్లు వెల్లడించారు. చర్మం, గోళ్లను విక్రయించడానికి ఛత్తీస్గఢ్ వెళ్తున్నామని, కళేబరాన్ని అక్కడే వదిలివేసినట్టు తెలి పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.