హైదరాబాద్ సిటీబ్యూరో/కవాడిగూడ, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో తెలంగాణను యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు అనేక నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ రఘోత్తమ్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనతో కలిసి దోమలగూడలో రూ.20 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ వ్యాయామ కళాశాల (నిజాం వ్యాయామ కళాశాల) నూతన భవనం, బాలికల వసతి గృహం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. 90 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన నిజాం వ్యాయమ కళాశాల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల శిథిలావస్థకు చేరిందని తెలిపారు.
ఏటా 500 మందికి వ్యాయామ విద్యనందిస్తున్న ఈ కళాశాలను అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతాయని వివరించారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన వ్యాయామ కళాశాలగా ఇది ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో తెలంగాణ యావత్ దేశం గర్విచే స్థాయికి ఎదిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. రన్నింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్పూల్ లాంటి అన్ని వసతులను అంతర్జాతీయ ప్రమాణాల ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్, కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ షఫీ మియాన్ తదితరులు పాల్గొన్నారు.
కోర్సులు ఇవే..
ఏటా 500 మంది వ్యాయామ విద్యనభ్యసించే ఈ కాలేజీలో డీపీఈడీ, బీపీఈడీ కోర్సులను నిర్వహి స్తున్నారు. వీటికి తోడు గతంలో ఎంపీఈడీ కోర్సు ఉండేది. కానీ ఎన్సీటీఈ ఆ కోర్సును 2020లో రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కృషితో ఆ కోర్సు రానుండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత పాలకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా..
నేను ఇదే కాలేజీలో చదువుకున్నా. ఇక్కడే లెక్చరర్గా పనిచేశా. ఉమ్మడి రాష్ట్రంలో ఈ కళాశాల ప్రాధాన్యతను, నూతన భవన నిర్మాణ ఆవశ్యకతను కాంగ్రెస్, టీడీపీ పాలకులకు పదే పదే వివరించా. చెప్పులు అరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యాయామ విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కొత్త భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ శ్రీధర్రెడ్డికి ధన్యవాదాలు.
– డాక్టర్ కే రాంరెడ్డి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ వ్యాయామ కళాశాల, దోమలగూడ