సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ముంపులేని ప్రాజెక్టు అనేది ఈ లోకంలో సాధ్యం కాదు. కాకపోతే అతి తక్కువ ముంపు.. అంతకు అనేక రెట్ల ప్రయోజనం అనేది ప్రధానం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మల్లన్నసాగర్ జలాశయం అనేది తక్కువ ముంపు అనేక వంద రెట్ల ప్రయోజనం అన్న ప్రాతిపదికన తలపెట్టారు. అందుకే నాలుగైదు గ్రామాలు ముంపునకు గురైనా.. తెలంగాణకు ఇదో జల ఖజానాగా మారనుంది. కలలో కూడా ఊహించనిరీతిలో 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయాన్ని తెలంగాణ గడ్డపై నిర్మిస్తుండటం ఒక విశేషమైతే.. ఇంత భారీ నిల్వ, ఇంత తక్కువ ముంపు అనేది చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులోనూ లేకపోవడం మరో విశేషం.
ముఖ్యంగా అత్యంత ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్ ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణకు బహుముఖ ప్రయోజనాలున్నాయి. ఒకవైపు కొండ పోచమ్మసాగర్, ఇంకోవైపు సింగూరు, మరోవైపు నిజాంసాగర్.. అంతేకాదు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు కూడా మల్లన్నసాగర్ నుంచే జలాలు అందనున్నాయి. ఇదే సమయంలో అనేక చెక్డ్యామ్లకు నీళ్లు రానున్నాయి. అందుకే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికివారే ఒక కేసీఆర్గా మారి.. తమ తమ ప్రాంతాల్లో చెక్డ్యామ్లను సత్వరమే నిర్మించుకునేందుకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. తెలంగాణకు జల ఖజానాగా భాసిల్లనున్న మల్లన్నసాగర్ను జూన్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఒక్కసారి మల్లన్నసాగర్ అందుబాటులోకి వచ్చిందంటే తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయనేది సుస్పష్టం. మల్లన్నసాగర్ నిర్మాణంలో కొన్ని ఊళ్లు మునిగిపోయాయనే బాధ ఉన్నప్పటికీ యావత్ తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం వారు తమ స్వస్థలాలను త్యాగం చేయక తప్పలేదు. వాళ్లను తెలంగాణ, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.