హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): వరల్డ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలించి చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతున్నట్టు స్పష్టమవుతున్నదని ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థికవేత్త, కార్నెల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ కౌశిక్బసు తెలిపారు. వార్షిక వృద్ధిరేటులో భారత్ వెనుకబడిపోయిందని, చిన్న దేశాలతో పోలిస్తే పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలోని ఒక శాతం అగ్రశ్రేణి ప్రాధాన్యాలను గుర్తించడంలో చేసిన పొరపాటుకు ఇది మూల్యమంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ట్విట్టర్లో ప్రశ్నించారు.
‘ప్రపంచ బ్యాంకు డాటాను విశ్లేషిస్తే 2020-22లో భారత వార్షిక వృద్ధి 0.8 శాతమే. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ సహా అనేక దేశాల కంటే ఇది చాలా తక్కువ. ఇది ప్రాధాన్యాల ఎంపికలో చేసిన పొరపాటు వల్ల వచ్చిన ఫలితం. భారత్కు అనేక బలాలు ఉన్నాయి. దయ, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన మంచి నైతిక లక్షణాలు.. దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి పునాదులు వేస్తాయి. కానీ వాటి విస్మరణ అవే పునాదులను అస్థిరపరుస్తుంది’అని కౌశిక్బసు ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక దుస్థితికి అద్ధంపడుతున్న ఆ ట్వీట్ను రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘రూపాయి ఐసీయూలో ఉంది. మూడు నెలలుగా అది కోలుకుంటుందనే చెప్తున్నారే తప్ప, దాని కోసం ఏమైనా చేస్తున్నారా నరేంద్ర మోదీజీ.. ఇదేనా మీ జ్ఞానానికి ప్రతీక’ అని ప్రశ్నిస్తూ మంత్రి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.