Manthani | పెద్దపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర మంథనితోనే మొదలయ్యింది. పీవీకి తొలుత 1952లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలి ఎన్నిక ఆయనకు కలిసి రాకపోవడంతో పరాజయం పాలయ్యారు. 1957 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే.. సోషలిస్టు పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారు. మంథని తొలి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు తిరిగి మంథని నుంచి పోటీ చేసేందుకు టికెట్ కోసం ఆశించగా ఆయనకు పోటీగా జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్కాచే సైతం కాంగ్రెస్ టికెట్ తనకే కావాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం మధ్యే మార్గంగా పీవీ పేరును తెరమీదకు తెచ్చింది.
దీంతో పీవీకీ 1957లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించింది. మంథని ఎమ్మెల్యేగా విద్య, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా, ఏకంగా ముఖ్యమంత్రిగా పని చేశారు. మంథని నుంచి 1957, 1962, 1967, 1972లో నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు నెలకొల్పారు. ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన పీవీ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కో అందలం ఎక్కుతూ చివరికి ప్రపంచమే కీర్తించే విధంగా భారత దేశ ప్రధానిగా తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. 20ఏండ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఇక్కడి ప్రజలతో మమేకమై పనిచేశారు.