హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): జాతీయ పార్టీగా ఏర్పడిన అనతికాలంలోనే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వివిధ రాష్ర్టాల్లోకి చొచ్చుకెళ్తున్నది. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. అనూహ్య మద్దతు లభిస్తున్నది. దేశమంతా గులాబీ నినాదం వినిపిస్తున్నది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా, ఇప్పుడు ఒడిశా నుంచి కీలకమైన, ముఖ్యమైన మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లోకి చేర డం గమనార్హం. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నవారిలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత గిరిధర్గమాంగ్తోపాటు ఏడుగురు మాజీ శాసనసభ్యులు, ముగ్గురు మాజీ ఎంపీలు ఉన్నారు. శుక్రవారం తెలంగాణభవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గిరిధర్ గమాంగ్తోపాటు ఇతర నాయకులకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ, కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు బీఆర్ఎస్లో చేరడంతో ఒడిశాలో ఆ రెండు పార్టీలకు తీరనినష్టం జరిగింది. గిరిధర్ గమాంగ్ ఒడిశా అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలు చేశారు. రైతుల సంక్షేమం కోసం ఏండ్ల తరబడి పోరాడారు. ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ సొంత రాష్ట్రం నుంచి తొమ్మిదిసార్లు పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి 1999 డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.
మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీలు హేమ గమాంగ్, రాంచంద్ర హన్సడా, జయ్రాం పంగి, బీజేపీ నేత శిశిర్ గమాంగ్, మాజీ ఎమ్మెల్యేలు నబిన్నందా(ధైన్కనాల్), బండారి పొఖ్రి (భద్రక్), అర్జున్దాస్(బింజార్పూర్, జాజ్పూర్), రాఘవ్శెట్టి- (బలిపట్నా, ఖర్దా), బ్రుందావన్ మాఝీ, దేవ్రాజ్శెతి (బీజేడీ మాజీ మంత్రి), జనతాదళ్ సోన్పూర్(మాజీ ఎమ్మెల్యే), స్నేహరంజన్దాస్ (బీజేపీ ఒడిశా రాష్ట్ర యువమోర్చాప్రధాన కార్యదర్శి), రబింద్ర మొహపాత్రా (కొరాపుట్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు), ఫల్గుణి సబర్, పీ గోపాల్రావు, మల్యా రంజన్ స్వెయిన్, అక్షయ్కుమార్ (నవనిర్మాణ్ కిసాన్ సంఘటన్ కన్వీనర్), రతాదాస్ (బీజేడీ యువత మాజీ అధ్యక్షుడు), కైలాశ్కుమార్ ముఖి (ఒడిశా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి), జన్మోర్చా, ప్రదీప్ప్రధాన్ (ఒడిశా ఆర్టీఐ యాక్టివిస్ట్ ఫోరం అధ్యక్షుడు), సేశ్దేవ్నందా (నవనిర్మాణ్ క్రుషక్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్, బీజేడీ రాష్ట్ర యువత సెక్రటరీ), ఉమాకాంత్ భరత్, నిమయిరాయ్ (ఎన్కేఎస్ రాష్ట్ర కో కన్వీనర్లు), ఖిరొట్రౌత్ (ఒడిశా హైకోర్ట్ న్యాయవాది, మానవ హకుల కార్యకర్త అడ్వకేట్), సూర్య పడి (ఒడిశా బార్ కౌన్సిల్ సభ్యుడు, అడ్వకేట్), బిష్ణుప్రియానాయక్ (కెంజొర్ నాయకుడు), రఖ్యాకర్ అనుపమ్ (ఝార్సుగూడ ట్రేడ్ యూనియన్ నాయకుడు), ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన రంజిత్ పట్నాయక్, జగ్బంధు మొహతా, కాశినాథ్ బెహ్రా (జిల్లా పరిషత్ మాజీ నేత), కైలాశ్చంద్రనాయక్ (బీజేడీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు), ఎండీ మన్వర్అలీ (ఎన్వైసీఎస్ రాష్ట్ర యువత కన్వీనర్), అమిత్కుమార్జెనా (ఎన్వైసీఎస్ కో కన్వీనర్), ప్రమోద్కుమార్ సామంత్రాయ్ (సమాజ్న్యూస్ పేపర్ సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త), రాంచంద్రన్ మడాని, గొబిందా మొండల్ (మలాన్గిరి గషాటి జిల్లాకు చెందిన జర్నలిస్టులు), జనార్దన్ మొహంతి (బలిగూడ బీజేపీ మండల్ సభాపతి), రాజేశ్పుత్రా (బలిగూడ బీజేపీ నేత), దినేశ్నాయర్ (బలిగూడ బీజేపీ నేత), సుధీర్ సదంగి (బలిగూడ బీజేపీ నేత), సమానత్ ఖొరా (బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు), ప్రతాప్ దరీ (పొట్టంగి నాయకుడు), ఘెను ముదాలి (మల్కన్గిరి ప్రజా జిల్లా అధ్యక్షుడు), హరీశ్చంద్ర గాలరి (మల్కన్గిరి డీపీబీపీ మాజీ కార్యదర్శి), జుఢుస్టిర్నాయక్ (బలిగూడ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి), నారాయణ్రావు (కొరాపుట్ సిమిలిగుడ బ్లాక్ మాజీ చైర్మన్), నిఖిల్హంతాల్ (డీపీబీపీ కలిమెల బ్లాక్ సభ్యుడు), బేణుహంతాల్, అమల్మండల్, సమర్ సిస (దిదాయ్ సమాజ్ మలాన్గిరి జిల్లా అధ్యక్షుడు), గోపి పంగి (కంధ సమాజ్ మలాన్గిరి జిల్లా అధ్యక్షుడు), టిల్లీ పంగి (డీపీబీపీ మలాన్గిరి జిల్లా ఉపాధ్యక్షుడు), సుధీర్సదాంగి (జేపీ అడ్వకేట్), రాజేంద్రగౌడ(ఆర్పీటీ జేపీ నాయకుడు), సుజయ కు ఆచార్య (బిపూర్ నాయకుడు), ఎస్ నారాయణరావు (ఎస్గూడ నాయకుడు, మాజీ చైర్మన్), గదాధర్ బారిక్ (బీజేపీ జిల్లా కార్యదర్శి), అర్జున్ పంగి, బనామలి ఖిల్లొ (ఎస్గూడ నాయకులు), రాయగఢ తెలుగు నాయకుడు శ్రీరాంమూర్తి తదితరులు ఉన్నారు.
గిరిధర్ గమాంగ్ ఒడిశా మాజీ ముఖ్యమంత్రి. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఒకడిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన గమాంగ్ ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2015లో బీజేపీలో చేరిన గమాంగ్ 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొనాల్సి రావడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 1943, ఏప్రిల్ 8న ఒడిశాలోని డిబిరిసింగిలో జన్మించారు. సుమారు 5 దశాబ్దాల రాజకీయ జీవితం గమాంగ్ది. 1972లో మొదటిసారి 5వ లోక్సభకు కోరాపుట్ నుంచి ఎన్నికైన గమాంగ్ ఆ తర్వాత వరుసగా ఎంపీగా 9 పర్యాయాలు గెలుస్తూ వచ్చారు. 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998, 2004లో లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు.
కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఉంటూనే 1999ఫిబ్రవరి 17న ఒడిశాకు 13వ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. డిసెంబర్ 6. 1999 వరకు ఆయన అతి స్వల్ప కాలం పాటే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గిరిజన సమస్యలపై పోరాడిన అసలు సిసలైన గిరిజన నేత గిరిధర్ గమాంగ్. దేశంలోనే పేరెన్నికగల గిరిజన నేతల్లో ఈయన ఒకరు. ఒడిశాకు చెందిన పది మంది నాయకుల్లో గమాంగ్ ప్రముఖుడు. ఒడిశాలోని 4 లోక్సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రాబల్యముంది. గమాంగ్కు భార్య హేమ, ఇద్దరు కొడుకులు, ఒక కూతురున్నారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ తలపెట్టిన రాజకీయ ఉద్యమంలో గమాంగ్ పాత్ర కీలకంగా మారనున్నది.
గాంధేయవాదిగా అక్షయ్కుమార్కు పేరున్నది. రైతు సమస్యలపై ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఈయనకున్నది. ముఖ్యంగా రైతులకు భూమి, నీరు, అడవి లాంటి ప్రకృతి సిద్ధమైన వనరులపై హక్కుల కోసంఅక్షయ్ పోరాడుతున్నారు. గుజరాత్లో నర్మదా బచావ్ ఆందోళన్లో మేధాపాట్కర్తో కలిసి పాల్గొన్నారు. మద్దుతు ధర, రైతులకు గౌరవ పెన్షన్, రైతులకు సామాజిక భద్రత కింద రూ.5 వేలు ఇవ్వాలని 2010 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు ఆందోళనలు చేపడుతూనే వస్తున్నారు. అక్షయ్ కుమార్ సమాజ నిర్మాణానికి, సమాజంలో అవసరమైన మార్పు తీసుకురావటానికి అధికారం అవసరం లేదని నమ్ముతారు. జై కిసాన్ నినాదంతో పాటు రైతుకు గౌరవం కావాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. 2019లో రాష్ట్రవ్యాప్తంగా రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలెన్నింటినో చేపట్టారు.
ఒకప్పుడు ఆమ్ఆద్మీ పార్టీలో పనిచేసిన హర్యానకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త యోగేందర్ యాదవ్తో కలిసి ప్రస్తుతం అక్షయ్ కుమార్ పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బలవంతులని, వారిని చైతన్యవంతులను చేస్తే ప్రభుత్వాలను, వ్యవస్థనూ మార్చే శక్తి వారికుందని అక్షయ్ కుమార్ బలంగా విశ్వసిస్తారు. నవ నిర్మాణ్ సమితికి అనుబంధంగా నవ నిర్మాణ్ క్రిషక్ సంఘటన ఏర్పాటు చేసి రైతులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 60 సంవత్సరాల వయస్సున్న అక్షయ్ కుమార్ అనుభవం అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.