హైదరాబాద్, అక్టోబరు 26 (నమస్తే తెలంగాణ): చేనేత, జౌళి రంగానికి కేంద్రం చేయూతనివ్వకపోగా, ఆ రంగాన్ని సావుదెబ్బ కొడుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు విమర్శించారు. కడుపులో గుద్ది, నోట్లో పిప్పర్మెంటు పెట్టిన తరహాలో కేంద్రం వ్యవహరిస్తున్నదని అన్నారు. చేనేతపై జీఎస్టీని 18 శాతం ప్రతిపాదించి ఐదు శాతానికి తగ్గించారని, దేశ చరిత్రలో చేనేతపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధాని మోదీ అని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్ఎస్లో చేరారు.
కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత, జౌళి రంగానికి కేంద్రం కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోగా ఉన్న వాటిని రద్దు చేస్తున్నారని, ఆ రంగాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలకు చేయూత నివ్వడంలేదని ధ్వజమెత్తారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాక కనీసం చేనేత, జౌళి రంగానికి ఓ విధానం(పాలసీ) అంటూ లేదని, ఫాం టూ ఫ్యాబ్రిక్, ఫాం టూ ఫ్యాషన్ అని ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. మన కంటే ఎంతో చిన్న దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ వస్త్ర ఉత్పత్తిలో మన కంటే ఎంతో ముందున్నాయని చెప్పారు. చేనేత, నేతన్నల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్, తాను కేంద్రానికి ఎన్నో విన్నపాలు చేశామని చెప్పారు.
నేతన్న నీకు జోహార్…
‘నరాలనే పోగులుగా చేసి, రక్తాన్ని రంగుగా అద్ది, జీవితమనే వస్త్రాన్ని ఆవిష్కరించే నేతన్న నీకు జోహార్. సత్తా, నైపుణ్యం ఉన్న చేనేత కళాకారులు దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నా రు, కానీ వారికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఆలంబన లేదు’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ చేనేత కళాకారులు సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లారని, వారు పారిశ్రామికులుగా రావాలన్నది సీఎం కేసీఆర్ కల అని చెప్పారు. అందులో భాగంగానే వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. గద్వాల, నారాయణ్పేట్లో చేనేత పార్కులు, సిరిసిల్లలో అపారెల్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. రాపోలు ఆనంద భాస్కర్ కేసీఆర్ నాయకత్వంలో భుజం భుజం కలిపి నడుస్తాను అని టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ పెద్ద కొడుకు: రాపోలు
ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తాను బీజేపీలో ఉండగా దేశవ్యాప్తంగా బీసీ కులాల వారిని లెక్కించాలని కేంద్రానికి లేఖ రాశానని, అప్పటినుంచి తనను హింసించడం మొదలుపెట్టారని వెల్లడించారు. మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమమని పార్లమెంట్ లోపల, బయట ప్రశంసిస్తే.. కాంగ్రెస్ నేతలు తనను అభిశంసించినంత పనిచేశారని చెప్పారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల పెద్ద కొడుకు అన్నారు. బీఆర్ఎస్లో భాగస్వామినై తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్రావు, ఎం శ్రీనివాస్రెడ్డి, బొంతు రామ్మోహన్, సాంబారి సమ్మారావు, మండల శ్రీరాములు, కర్నాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.