సూర్యాపేట : కేసీఆర్(KCR) అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు.. కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్..ముట్టుకుంటే మాడి మసైపోతారని ఆర్మూర్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి(Jeevan Reddy), గాదరి కిశోర్ కుమార్(Kishore Kumar) అన్నారు. నల్లగొండలో కేసీఆర్ సభను అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy brothers)ఫైర్ అయ్యారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామని చెప్పడం పిరికిపందచర్య అన్నారు.
ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు ఈ ఏరియాలో ప్రెస్ మీట్ కూడా పెట్టని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆరోపించారు. అవగాహన లేని సన్నాసులు, చదువు లేని దద్దమ్మలు కృష్ణా జలాలను మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించడం చేతగానితనమని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డికి ఆ శాఖపై కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.
తెలివి లేని సీఎంగా రేవంత్ రావడం ఇక్కడి ప్రజల దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత నీటి సాగునీటిదని గుర్తు చేశారు. కృష్ణ బోర్డు అప్పగిస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బ్రోకర్స్, జోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపులు కొత్త కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలి వచ్చినా కేసీఆర్ సభను అడ్డుకోలేరన్నారు.