హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలో కేసీఆర్తోనే రైతురాజ్య స్థాపన సాధ్యమవుతుందని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత వడ్డే శోభనాద్రీశ్వర్రావు అన్నారు. బీజేపీ, మోదీతో దేశంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ బందిపోటు విధానాలను అనుసరిస్తుంటే కేసీఆర్ రైతుబంధు వంటి పథకాలతో బంధుప్రీతిని పంచుతున్నారని పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పంచుకొన్న విశేషాలు..
బీజేపీది అత్యంత నిసిగ్గు వాదన. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వ్యవసాయరంగాన్ని తీవ్రంగా నిర్వీర్యంచేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది మోదీ ప్రభుత్వమే. రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. కార్పొరేట్ సంస్థలకు కనీవినీ ఎరుగని రీతిలో మేలు జరుగుతున్నది. దాదాపు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంటకు..మార్కెట్లో లభించే ధరకు పొంతనలేదు. ఎరువుల ధరలు పెరగటం, వ్యవసాయ రంగానికి సబ్సిడీల్లో కోత విధించటం గతంలో ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు మోదీ కట్టబెడుతున్నారు. ప్రభుత్వ ధనాన్ని తనకు నచ్చిన..తను మెచ్చిన వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు రైటాఫ్ (మాఫీ) చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా కేసీఆర్ దృఢంగా నిలబడుతున్నారు. వ్యక్తిగతంగా అభినందిస్తున్నా. కృతకృత్యుడు కావాలి.
కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వటాన్ని హర్షిస్తున్న. పల్లె సీమలు బాగు పడితేనే అభివృద్ధి కానీ నగరాల్లో పట్టణాల్లో పెద్ద పెద్ద భవంతులు.. మేడలు మిద్దెలు కడితేనో అభివృద్ధి కాదని పూజ్య బాపూజీ చెప్పారు. బాపూజీ ఆలోచనా ధోరణికి అనుగుణంగా చంద్రశేఖర్రావు వ్యయసాయరంగాన్ని అద్భుతంగా మార్చారు. రైతుబంధు ఆలోచనా విధానం వినూత్నమైంది. రైతు ఏకారణంచేత మరణించినా ఆ కుటుంబం వీధిపాలు కాకుండా అండగా నిలిచేందుకు రూ. 5లక్షలు బీమాగా ఇవ్వటం చరిత్రలో ఏ పాలకుడికీ ఆలోచన రాలేదు. ఉచిత కరెంట్, నీటి తీరువాను రద్దు గొప్ప విషయం. కాళేశ్వరంప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయటం గొప్ప విషయం. 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొని రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆయిల్ ఫార్మింగ్ను ప్రోత్సహించటం మంచి పరిణామం.
బందిపోటుకు.. బంధువుకు ఉన్నంత తేడా ఉంది. మోదీ ప్రభుత్వం బందిపోటు తరహాలో రైతును నిర్వీర్యం చేస్తున్నవి. చంద్రశేఖర్రావుది రైతు బంధుప్రతీ పద్ధతి. ఇవాళ దేశ రైతాంగం కేసీఆర్వైపు ఆశగా చూస్తున్నది. తెలంగాణ విధానాలను దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ వస్తున్నది. ఎన్టీఆర్ ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక హార్స్ పవర్కు రూ.50 పెట్టారు. దీని వల్లే తెలంగాణ, రాయలసీమల్లో దాదాపు 12 లక్షల మోటర్లు పెట్టుకొన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్రావు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మోదీ రైతుల మెడమీద ఉరితాడు బిగించే ఎలక్ట్రిసిటీ బిల్లు తెస్తున్నారు. రైతుల దగ్గరి నుంచి కరెంట్ చార్జీలు ముందుగానే వసూలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే దాదాపు 75 వేల మీటర్లు బిగించారు. సంపద కొద్దిమంది చేతుల్లోకి కేంద్రీకరించేలా ప్రభుత్వ విధానాలు ఉండకూడదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు స్పష్టం చేశాయి. కానీ మోదీస్వామ్యంలో పక్కకు పెట్టారు. పెట్టారు. క్రమక్రమంగా దేశ విద్యుదుత్పత్తి.. సరఫరా వ్యవస్థను అదానీకి అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఇలాంటి విధానాలను ఎదుర్కోవడానికి భావసారూప్యత గల శక్తులు ఒకేతాటి మీదకు రావాలి.
కేసీఆర్ తప్పకుండా విజయం సాధిస్తారనే విశ్వాసమున్నది. చంద్రశేఖర్రావు ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధించేదాకా విడిచిపెట్టరు. విషయం మీద సంపూర్ణ అవగాహన. లక్ష్యాన్ని ఎంచుకోవడం.. దాన్ని సాధించే మార్గాన్ని వేసుకోవడం.. చివరికి సాధించటం అనే లక్షణాలు చంద్రశేఖర్రావులో మెండుగా ఉన్నాయి. నాకే కాదు ఎన్టీరామారావుకూ ఇదే అభిప్రాయం ఉండేది. వ్యవసాయ రంగం మీద నేను మాట్లాడితే స్థానిక సంస్థల పనితీరు మీద చంద్రశేఖర్రావు శిక్షణ ఇచ్చేవారు. ఏదైనా చెప్తే దానిపై సంపూర్ణంగా అధ్యయనం చేసి అద్భుతమైన వాక్పటిమతో మెప్పించేవారు. భాష పట్ల.. భావన పట్ల చింతన ఉన్న నాయకుడు. విశాల దృక్పథంతో దేశ రాజకీయాల్లో మార్పు కోసం ఆలోచించే వాళ్లే కరువయ్యారు. తెలంగాణలో రైతు రాజ్య స్థాపన జరిగిందని నేను భావిస్తున్న. ఇది దేశవ్యాప్తం కావాలంటే ఈ విధానాలు అమలుచేసే స్థాయిలో ఉండగలగాలి. అయితే.. మోదీని లేదా బీజేపీని వ్యతిరేకించే శక్తులను కూడగట్టాలి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ఉన్నా జాతి హితం కోసం చిత్తశుద్ధితో ఆలోచించే నాయకుడు ఈ దేశానికి తప్పకుండా అవసరం. అది కేసీఆర్ తీరిస్తే.. ఒక తెలుగువాడిగా చాలా సంతోషిస్తా.
అది కేవలం అపోహ మాత్రమే. నిజానికి బీజేపీకి విధానం అంటూ ఏదీ లేదు. గతంలో వాజ్పేయి.. ఒక ఎంపీ సీటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా.. ఏదన్నా చేసి నిలబెట్టుకోవాలని ఆలోచన చేయలేదు. ‘అది అప్రజాస్వామికం. నాకు అధికారం లేకపోయినా మంచిదే’ అన్నారు. కానీ ఇవ్వాళ ఏం జరుగుతున్నది? మోదీ అమిత్ షా ద్వయం అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వాజ్పేయి, అద్వానీ జమానాలో బీజేపీకి ఒక ఆలోచనా విధానం ఉండేది. మోదీ, అమిత్షా ద్వయానిది అరాచక విధానం. అరాచకాలు ఎంతోకాలం నిలవవు. చాలా మందిలో బీజేపీ బలమైనది అనే భయం ఉండబట్టే వారి ఆటలు సాగుతున్నాయి. నిజానికి బీజేపీకి అంత బలం లేదు. ఇతరుల బలహీనతలను బలంగా మార్చుకొని మాత్రమే కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను ఛేదించేందుకు చంద్రశేఖర్రావు మొదటి నుంచి ధైర్యంగా నిలబడుతున్నారు. రేపు ఆయన కార్యాచరణ ప్రకటించాక దేశంలో మార్పు తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో చంద్రశేఖర్రావు తప్పకుండా రాణిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను.