వనపర్తి : ప్రజల కోసం పనిచేస్తాం. ఒక్క గంట కరంటు ఆగినా వెంటాడుతాం.. వేటాడుతామని మాజీ మంత్రి నిరంజర్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు. సోమవారం వనపర్తి(Wanaparthi) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుబంధు ఇవ్వాలన్నారు. వ్యవసాయం గెలిచినప్పుడు ఎగరలేదు.. ఓడినప్పుడు బాధపడను. నా ఓటమి నన్ను బాధపెట్టలేదు. కానీ, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోవడం బాగా కలచివేసిందన్నారు.
ప్రధాన మంత్రిగా పోటీ చేసిన ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ఎందరో సీఎం అభ్యర్థులు కూడా ఓడిపోయారని గుర్తు చేశారు. ఓడిపోయానని ఎక్కడికి వెళ్లను.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను కాంగ్రెస్ వాళ్లు ఇచ్చారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోస పోయాము అనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారుతున్న కాల్వలు.. పండుతున్న పంట పొలాలు, కనిపిస్తున్న విద్యాసంస్థలు, ఏదుల రిజర్వాయర్, మార్కెట్ యార్డు మమ్మల్ని గుర్తు చేస్తాయి. నన్ను మరిపించడం ఎవరి తరం కాదన్నారు. ఫలితాలను సమీక్షించుకొని ముందుకెళ్తామన్నారు.