నిర్మల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలోని కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన సంక్షేమ సంబురాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందుతున్నాయని వెల్లడించారు . సంక్షేమ ఫలాలు పొందని ఇల్లు లేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, రైతు భరోసా, దళితులకు దళిత బంధు అందజేస్తోందన్నారు. 2014 కు ముందు అచేతనంగా మారిన కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ నే అన్నారు.
కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కులవృత్తుల కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని(Financial Support) ప్రారంభించిందని తెలిపారు. వెనుకబడిన సామాజికవర్గాల్లోని చేతి వృత్తులు, కులవృత్తులు నిర్వహించే మేదరి, కమ్మరి, రజక, నాయి బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని వెల్లడించారు. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రెండువందల రూపాయల పింఛన్ను ఆసరా కింద రూ. 2,016, దివ్యాంగులకు రూ. 3,016 పెంచడం ప్రజల కష్టాలెరిగిన ప్రజా పాలకుడు కేసీఆర్తోనే సాధ్యమైందని పేర్కొన్నారు.