Amitabh kundu | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బలహీనవర్గాలకు చెందిన యువత నైపుణ్యాలను వైవిధ్యభరితంగా మెరుగుపర్చాలని జేఎన్యూ మాజీ డీన్ ప్రొఫెసర్ అమితాబ్ కుండు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ పొందుతున్న 86 మంది ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్ఎస్), 26 మంది ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారులతో శనివారం సివిల్ సర్వీసెస్ డే నిర్వహించారు.
ఈ సందర్భంగా అమితాబ్ కుండు ‘ఎమర్జింగ్ ఇండియా 2047’ అనే అంశంపై మాట్లాడుతూ 21వ శతాబ్దం ఏషియాదని, మరీ ముఖ్యంగా ఇండియాది అంటూ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో వచ్చిన నూతన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. దృఢమైన డేటా వ్యవస్థను నిర్మించే బాధ్యతను ఐఎస్ఎస్, ఐఈఎస్ అధికారులు చేపట్టాలని సూచించారు. గణాంకాలను కఠినంగా, నిష్పక్షపాతంగా విశ్లేషించి సమగ్రమైన, స్థిరమైన అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ డీజీ బెనహర్ మహేశ్దత్ ఎక్కా, కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి తదితరులు పాల్గొన్నారు.