హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: ప్రజల విశ్వాసమే న్యాయ వ్యవస్థకు నైతిక ైస్థెర్యాన్ని ఇస్తుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పీపుల్స్ జడ్జిగా, కామన్మ్యాన్ జడ్జిగా ఏ పేరు సంపాదించినా.. ప్రజల దృష్టిలో కోర్టుల ప్రతిష్ఠను పునరుద్ధరించడానికి ప్రయత్నించానన్న సంతృప్తి ఉన్నదని చెప్పారు. అంకితభావం, చిత్తశుద్ధితో కష్టపడే విధానాన్ని నమ్ముకొని తాను ఈస్థాయికి చేరుకొన్నానని.. అదృష్టం తోడయ్యిందని పేర్కొన్నారు.
శనివారం గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ.. తన 16 నెలల పదవీ కాలంలో కరోనా కారణంగా 50 రోజులు మాత్రమే కోర్టులు భౌతికంగా నడిచాయని తెలిపారు. కోర్టుల్లో ఖాళీ పోస్టులు, పెండింగ్ కేసులు తనకు ప్రధాన సవాల్గా నిలిచాయని చెప్పారు. సమాజంలోని అసమానతలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యాపారం చేసే వారికి చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.
ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్
పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రభుత్వమే పెద్ద లిటిగెంట్గా ఉన్నదని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ సమస్యపై తనకున్న అవగాహనతో ముఖ్యమంంత్రులు, చీఫ్ జస్టిస్లతో జరిగిన సమావేశంలో ప్రధాని సమక్షంలోనే ఈ విషయం స్పష్టంచేశానని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రాయోజిత వ్యాజ్యాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే న్యాయవ్యవస్థలో సగం సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకానికి విరుద్ధంగా, న్యాయ వ్యవస్థకున్న స్వేచ్ఛ కేవలం తీర్పుకు మాత్రమే పరిమితం చేయబడిందన్నారు.
న్యాయవ్యవస్థకు ఆర్థిక అధికారంలేదన్నారు. ఆర్థిక సహాయం, నియామకాల విషయానికి వస్తే ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం ఎల్లప్పుడూ ఒక తాడు సాయంతో నడవడం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయ వ్యవస్థలోనే పరిష్కారం కనుగొనాలని ప్రయత్నం చేశానని, వివిధ శాఖల మధ్య వివాదాలు, సమస్యలు, సర్వీసు మ్యాటర్స్, వీటి పరిష్కారానికి సంబంధించి సమస్యలు భయంకరంగా ఉన్నాయని జస్టిస్ రమణ తెలిపారు.
పెట్టుబడుల సాధనలో తెలంగాణ భేష్
పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని, ఉపాధి అవకాశాల కల్పనలో రోల్ మాడల్గా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందించారు. అనంతరం సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటయ్యాక మొదటి దశాబ్దం లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రణాళికను రచించిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలను ఇతర రాష్ట్రాల వారు ఇచ్చి అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్కుమార్, హెచ్యూఎల్ ఈడీ కిదర్ లిలి, సరస్వతి వీణా వాయిద్యకారిణి జయంతి కుమరేశ్ తదితరులు పాల్గొన్నారు.