బంజారాహిల్స్, సెప్టెంబర్ 14: అమ్మాయి విషయంలో ఏర్పడ్డ మనస్పర్థలతో ఒక పబ్లో ఏపీ మాజీ డీజీపీ కుమారుడు హంగామా సృష్టిస్తూ.. యువకులపై దాడికి దిగాడు. ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లోని ప్లెజెంట్ వ్యాలీలో నివాసముండే ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ (29)కు సమద్ స్నేహితుడు. వీరికి మాసబ్ట్యాంక్ ప్రాంతవాసి సిద్దార్థ మాగ్నాని అనే యువకుడితో ఓ యువతి విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. పబ్స్లో మ్యూజిక్ లైవ్ బ్యాండ్ నిర్వహించే సమద్కు మయూర్ అనే స్నేహితుడు ఉన్నాడు.
బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.10లోని 040 పబ్లో సమద్తోపాటు మయూర్ లైవ్బ్యాండ్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి మయూర్ స్నేహితులతోపాటు డేవిడ్ సవాంగ్ దోస్తులు వచ్చారు. అక్కడ మయూర్ స్నేహితులు వీడియో తీస్తుండగా, ఎందుకు తీస్తున్నావంటూ డేవిడ్ స్నేహితులు గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు దారితీసింది. పబ్ సిబ్బంది వారిని బయటకు పంపించారు. బయట ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడుల్లో డేవిడ్తోపాటు మయూర్ స్నేహితుడు సిద్దార్థ కూడా గాయాలయ్యాయి. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.