హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడం వల్ల కలిగే ప్రభావంపై రాష్ట్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు చర్చించుకొంటున్నారు. ఏ నలుగురు నాయకులు కలిసినా దీనిపైనే మాట్లాడుకొంటున్నారు. ఇన్నా ళ్లూ కేసీఆర్ తెలంగాణ దాటి వెళ్లరని బీజేపీ నేతలు భావించారు. ఒకవేళ జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్లినా.. ఇతర పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పా టు చేస్తారని అనుకొన్నారు.
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా పార్టీ పేరును మార్చడం, తెలంగాణ మాడల్ను దేశం ముం దు చర్చకు పెట్టడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిసింది. ఇకనుంచి కేసీఆర్ ఏం మాట్లాడినా జాతీయస్థాయిలో చర్చ జరుగుతుందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. జాతీయ మీడి యా కేసీఆర్పై మరింత దృష్టి పెడుతుందని, ఢిల్లీలో పరపతి మరిం త పెరిగి మున్ముందు జాతీయస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పకపోవచ్చని చర్చించుకొంటున్నారు.
తెలంగాణకు దూరం చేయలేం
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రకటించగానే.. తెలంగాణకు దూరమయ్యారంటూ ప్రచారం చేయాలని బీజేపీ నేతలు తొలుత భావించి ఒకరిద్దరితో విమర్శలు చేయించారు. అవేమీ ప్రభావం చూపలేదని, బీఆర్ఎస్ను ప్రజలు స్వాగతించారని అర్థమైపోయింది. పార్టీ పేరు మారినా తెలంగాణ నుంచి కేసీఆర్ను వేరుచేయలేమని ఎట్టకేలకు కమలం నేతలకు తెలిసివచ్చింది. చేసేది లేక ప్రత్యామ్నాయంగా ఎలా ఇరికించాలో తెలియక గందరగోళంలో పడ్డారు.