హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఎండాకాలం ప్రారంభం కావడంతో అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణ, వన్యప్రాణులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఆ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రధాన అభయారణ్యాలైన కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లతోపాటు వివిధ ఫారెస్ట్ డివిజన్లలో వన్యమృగాల ధూపను తీర్చేందుకు చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో 4 వేల సాసర్పిట్ (నీటి వనరులు)లను ఏర్పాటు చేసి నీటిని అందుబాటులో ఉంచింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతి 4 చ.కి.మీ విస్తీర్ణం పరిధిలో ఒక సాసర్పిట్ను ఏర్పాటు చేసి, అందులో 700 లీటర్ల నుంచి 1000 లీటర్ల నీటిని నిత్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు.
ఈ నీటి వనరుల సమీపంలోకి స్థానికులు, వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడకుండా పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల గుర్తింపునకు ఫైర్ వాచ్టవర్స్ను ఏర్పాటు చేసి ఇందులో 24 గంటలపాటు ఉద్యోగులు విధులు నిర్వహించేలా ప్లాన్ రెడీ చేశారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ పర్యవేక్షణ ఉంటుందని పీసీసీఎఫ్ డోబ్రియల్ తెలిపారు. జంతు ప్రదర్శనశాలల్లో కూడా జంతువులు, పక్షుల సంరక్షణకు ఓపెన్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కట్టడికి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అధిక తాపం నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 100 నుంచి 150 కూలర్లను బిగిస్తున్నామని తెలిపారు.