సిరిసిల్ల రూరల్, జనవరి 16: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రహాస్ (61)15 ఏండ్ల క్రితం సిరిసిల్లకు వలస వచ్చాడు. ఇందిరమ్మకాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటున్నాడు. టెక్స్టైల్పార్క్లో వలస కార్మికుడిగా పనిచేస్తున్న చంద్రహాస్.. అక్కడి పరిశ్రమలు మూతపడటంతో ఖాళీగా ఉంటున్నాడు.
కుటుంబానికి దూరంగా ఉండటం, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతుండటంతో సోమవారం రాత్రి అద్దె ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి రావడానికి తమ వద్ద కిరాయి కూడా డబ్బులు లేవని, రాలేకపోతున్నామని చెప్పడంతో మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు జరిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.