హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): అచ్చం సినిమాల్లో జరిగినట్టే..! వేరే దేశం అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమెను తన వద్దకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. హీరో కాబట్టి చివరికి ఆమెను కలుసుకుంటాడు. కానీ, రియల్ లైఫ్ కదా! కొంచెమైనా ట్విస్ట్ ఉండొద్దూ! తన హీరో కోసం పాక్ నుంచి నేపాల్.. అక్కడి నుంచి భారత్లోకి రావటానికి నకిలీ ఆధార్ సృష్టించిందో యువతి. సరిహద్దు దాటొస్తూ చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన అహ్మద్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి సోషల్ మీడియాలో పాక్కు చెందిన ఖలీజానూర్తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. పెండ్లి చేసుకోవాలనుకొన్నారు.
అబ్బాయి తల్లిదండ్రులు ఓకే చెప్పినా, అమ్మాయివాళ్లింట్లో ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయిన ఆ యువతి దుబాయ్ చేరుకొన్నది. నేపాల్ మీదుగా భారత్లోకి వస్తే వీసా అవసరం లేదని అహ్మద్ ఆమెను నేపాల్కు పంపాడు. నేపాల్ నుంచి భారత్కు తీసుకొచ్చే బాధ్యతను తన సోదరుడు మహమూద్కు అప్పగించాడు. నేపాల్కు చేరుకొన్న మహమూద్.. యువతిని కలిసి నకిలీ ఆధార్ కార్డును అందించాడు. ఒక నేపాల్ వ్యక్తి సహాయంతో సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశిస్తుండగా బీహార్ పోలీసులు తనిఖీ చేశారు. నూర్ వద్ద ఉన్న ఆధార్ కార్డును పరిశీలించి వివరాలు అడగ్గా, తడబడి జరిగిన విషయాన్నంతా చెప్పేసింది. దీంతో నూర్, మహమూద్, మరో వ్యక్తిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. అసలు కథ ఇదేనా? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.