హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు పులుల వరుస మృత్యువాత ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులను సంరక్షించాల్సిన రాష్ట్ర అటవీశాఖ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య పోరు వల్ల పులులు మృత్యువాత పడలేదని తేలింది. విషప్రయోగం జరిగిందా, పశువుకు, పులికి మధ్య జరిగిన పోరులో చనిపోయాయా, ఎవరైనా కావాలని కొట్టి చంపారా? అన్నది తేలాల్సి ఉన్నది.
కుమ్రంభీం జిల్లా కాగజ్నగర్ కారిడార్ దరిగాం అటవీ ప్రాంతంలోని గొందిలో మూడురోజుల వ్యవధిలో రెండు పులులు మృతి చెందాయి. ఆడపులి మరణించినప్పుడు టెరిటోరియల్ ఫైట్ జరిగినట్టు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 27న పశువులపై పులి దాడికి పాల్పడినట్టు పేర్కొన్న అటవీశాఖ అధికారులు.. ఆ పశువు మాంసం తిన్న ఎస్-16 అనే అడ పులి వారం తరువాత మరణించింది. అదే స్థలంలో ఎస్-9 కారకస్ అనే మగపులి మృత్యువాత పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
పులులు మృతి చెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే అటవీశాఖ అధికారులు పశు కళేబరాన్ని గుర్తించారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మంగళవారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) సిబ్బంది రంగంలోకి దిగారు. టెరిటోరియల్ ఫైట్ జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో పులుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పులి దాడిలో పశువు మృతి చెందడంతో విషప్రయోగం జరిగిందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. పులుల మృతిపై రాష్ట్ర అటవీశాఖ అధికారుల వైఖరిపై అనుమానాలకు తావిస్తున్నది.
పులి తలకు గాయాలు, విరిగిన కాళ్లు
ఎన్టీసీఏ అధికారుల దర్యాప్తులో పులుల తలలకు బలమైన గాయలు ఉన్నట్టు గుర్తించారు. పైగా కాళ్లు విరగడంతో పశువుకు, పులికి మధ్య జరిగిన ఆధిపత్య పోరా, ఎవరైనా కావాలని కొట్టి చంపారా అని అనుమానిస్తున్నారు. ఎలాంటి వీడియో ట్రాక్ కెమెరాల్లో రికార్డ్ కాకపోవడం గమనార్హం. మొదటి పులి మరణించిన 300 మీటర్ల దూరంలోని కుమ్రంభీం కాలువలో పడి ఎస్-9 కారకస్ అనే మగ పులి చనిపోయింది. మగ పులికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు పశువైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇదే సమయంలో కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ శాంతారాంతోపాటు కుమ్రంభీం జిల్లా డీఎఫ్వో నీరజ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. దీనిపై కేంద్ర బలగాలు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నాయి. రెండు పులుల మృతిపై మిస్టరీ వీడాల్సి ఉంది.
అటవీ అధికారుల ప్రకటనలపై అయోమయం
అటవీశాఖ అధికారుల ప్రకటనలపై అయోమయం నెలకొంది. ఎస్16 అనే ఆడ పులి మరణించిన సమయంలో అటవీ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపకుండానే రెండు పులుల మధ్య టెరిటోరియల్ ఫైట్ జరిగిందని, ఆ ఫైట్లో ఆడపులి మరణించిందని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ గత కొద్ది రోజులుగా ‘యాంటీ పోచింగ్ డ్రైవ్’ చేపడుతున్నది. ఈ సమయంలోనే రెండు పులులు మృతిచెందడం గమనార్హం. టైగర్ కారిడార్లో కెమెరాలతో పకడ్బందీగా ట్రాకింగ్ ఏర్పాట్లు ఉన్నా రెండు పులులు మృతి చెందిన ఘటనలు కెమెరాల్లో రికార్డు కాకపోవడం, ఈ ఘటనల పట్ల వాస్తవాలు తెలుసుకోకుండానే హడావుడి ప్రకటనలు చేయడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషప్రయోగంతోనే పెద్దపులి మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో మగ పులి విషప్రయోగంతోనే మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని పీసీసీఎఫ్ డోబ్రియాల్, అడిషనల్ పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) పర్గెయిన్, సీసీఎఫ్ శాంతారాం తెలిపారు. సోమవారం గుర్తించిన మరో పులి కళేబరాన్ని మంగళవారం పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆనంతరం వివరాలు వెల్లడించారు. మూడురోజుల క్రితం మృతి చెందిన రెండేండ్లలోపు పులి మాత్రం ఆవాసం కోసం జరిగిన ఘర్షణలోనే మృతి చెందినట్టు నిర్ధారించారు. తాజాగా గుర్తించిన పులి ఎస్-9 అని, దీని వయస్సు ఐదేండ్లు ఉంటుందని తెలిపారు.
మృతి చెందిన పులి మెడలో ఇనుప తీగ ఉచ్చు ఉన్నదని, కానీ విషప్రయోగంతోనే అది మృతి చెందినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. చనిపోయిన పశువు ద్వారా ఈ విషప్రయోగం చేసి ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చనిపోయిన పులి, విషాన్ని చల్లిన పశువు కళేబరం శాంపిళ్లను సేకరించి, హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపినట్టు వివరించారు. విషప్రయోగానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు అటవీ సిబ్బందితో ముమ్మరంగా గాలిస్తున్నట్టు పీసీసీఎఫ్ డోబ్రియల్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనదని చెప్పారు.