పటాన్చెరు, జూలై 30: వైఫల్యాలే జీవిత పాఠాలు నేర్పుతాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం-హైదరాబాద్లో శనివారం నిర్వహించిన 13వ స్నాతకోత్సవంలో ఆయన స్నాతకోపన్యాసం చేశారు. తన 24 ఏండ్ల ప్రయాణంలో మంచి చెడులు, ఆశ నిరాశలు, ఎత్తు పల్లాలను చూశానని చెప్పారు. ఐఐఎస్సీలో తన పరిశోధక విద్యార్థి దశను గుర్తు చేసుకొన్నారు. సామర్థ్యాలను పెంచే పరీక్షలతో నిమిత్తం లేకుండా పరిశోధన కేవలం స్వీయ సంకల్పం, కృషి, ఆశయాలపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. శ్రమించే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసినందుకు ప్రొఫెసర్ శాంతాసిన్హా, తెలుగు సాహిత్య ఔన్నత్యానికి కృషి చేసిన ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్కు స్నాతకోత్సవం సందర్భంగా గౌరవ డాక్టరేట్ (డీ లిట్)లను ఇచ్చి సత్కరించారు.
కొవిడ్ కారణంగా బాలకార్మిక వ్యవస్థ మళ్లీ వేళ్లూనుకుంటున్నదని ప్రొఫెసర్ శాంతాసిన్హా ఆందోళన వ్యక్తంచేశారు. దానిని నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతోపాటు సాహిత్యం కూడా చదవాలని సూ చించారు. మంచి నవలలు మంచి మార్గంతోపాటు మనలోని గొప్పదనాన్ని, లోపాలను చూపుతాయన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా 1,346 మందికి డిగ్రీలను, 18 మం ది ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందించారు. 38 మంది రీసెర్చ్ స్కాలర్లకు పీహెచ్డీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గీతం అధ్యక్షుడు శ్రీభరత్, గీతం కులపతి డాక్టర్ వీరేందర్సింగ్ చౌహాన్, వీసీ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, వర్సిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.