హైదరాబాద్, జనవరి11 (నమస్తే తెలంగాణ): టీచింగ్ హాస్పిటళ్లలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచింగ్ హాస్పిటళ్ల పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్ల వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానానికి చేరుకున్నదని, మొదటి స్థానానికి చేరడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం అన్నిరకకాల చర్యలు తీసుకుంటున్నదని, సిబ్బంది ఉత్సాహంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీపీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.