నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘మునుగోడు ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని మరోసారి ఈ విజయం ద్వారా రుజువైంది. వారు సీఎం కేసీఆర్పై, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు వందశాతం ప్రయత్నం చేస్తా. ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తక్షణం దృష్టి పెడతా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా’ అని మునుగోడులో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చెప్పారు. ఫలితం వెలువడిన అనంతరం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మునుగోడులో 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు అబద్ధపు హామీలు, మాయ మాటలతో మోసపోయారు. 2014లో ఇక్కడ టీఆర్ఎస్ను గెలిపించారు. తాగు, సాగునీరు, రోడ్లు తదితర సమస్యల పరిష్కారానికి అప్పుడు కృషి జరిగింది. మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వల్ల అభివృద్ధి ఆగిపోయింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమని మునుగోడు ప్రజలు విశ్వసించారు. అందుకు ఈ విజయమే తాజా ఉదాహరణ.
ఈ ఎన్నికలో ప్రజలు ధర్మం వైపు, అభివృద్ధి వైపు నిలిచారు. రాజగోపాల్రెడ్డి సొంత లాభం కోసం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు’ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించగా అన్ని హామీలను సీఎం కేసీఆర్, కేటీఆర్ల సంపూర్ణ సహకారంతో నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేయడంతో పాటు మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. తన విజయం కోసం కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీల రాష్ట్ర, జిల్లా నేతలు, సామన్య కార్యకర్తలు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యావాదాలు తెలిపారు.