ఫ్లోరోసిస్పై అలుపెరగక పోరుసల్పిన అంశాల స్వామి అస్తమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, పలువురు ప్రముఖులు స్వామి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమైక్య పాలనలో ఫ్లోరోసిస్ సామాజిక సమస్యకు తానే ఓ ప్రతీకగా మారిన అంశాల స్వామి.. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ సత్సంకల్పానికి ప్రేరణగా నిలిచారు.
నల్లగొండ ప్రతినిధి, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ఫ్లోరోసిస్ పోరాట యోధుడు అంశాల స్వామి (37) అకాల మరణం చెందారు. ఇటీవల తనకు ఓ వ్యక్తి బహూకరించిన ఎలక్ట్రిక్ బైక్పై శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లి వచ్చిన స్వామి.. ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో అంతర్గతంగా రక్తస్రావమై శనివారం ఉదయం 6:30 గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. స్వామి అకస్మాత్తుగా మృతి చెందడంతో కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్వామి కుటంబ సభ్యులకు ధైర్యం చెప్తూ సొంత ఖర్చులతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. కర్నాటి విద్యాసాగర్కు బాధ్యత అప్పజెప్పి దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు పలుమార్లు ఫోన్లో వాకబు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి శివన్నగూడెంలో స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంత్యక్రియలకు గ్రామస్థులతో పాటు పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలు భారీగా హాజరయ్యారు.
ఫ్లోరైడ్పై స్వామిది అలుపెరుగని పోరు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అంశాల సత్యనారాయణ-వెంకటమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన స్వామి పుట్టుకతోనే ఫ్లోరైడ్ బాధితుడు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంలో సమైక్య పాలకుల వివక్షను నిరసిస్తూ.. సామాజిక ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణతో కలిసి స్వామి ఫ్లోరైడ్ భూతంపై యుద్ధాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సోషల్ వర్కర్ కంచుకట్ల సుభాశ్ స్థాపించిన ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. 2003లో దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో మరో ఫ్లోరైడ్ బాధితుడు కొత్తపల్లి నర్సింహతో కలిసి ఢిల్లీ వెళ్లిన స్వామి..
అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి టేబుల్పై పడుకొని తమ గోస చెప్పుకున్నారు. స్వామి పరిస్థితిని చూసి వాజపేయి చలించిపోయినా.. సరైన పరిష్కారం చూపలేకపోయారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంపై స్వామి యుద్ధం ప్రకటించడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ వేసింది. కృష్ణా జలాల సరఫరాతోనే ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమవుతుందని స్వామి ఆ కమిటీకి తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్, విజయశాంతి లాంటి వారు వచ్చి షో చేయబోతే.. ఫ్లోరైడ్ బాధితులను ఎగ్జిబిషన్లో బొమ్మల్లా చూడవద్దంటూ అంశాల స్వామి హెచ్చరించారు.
కేటీఆర్ ప్రగాఢ సానుభూతి
దురదృష్టవశాత్తు అంశాల స్వామి మృతి చెందడంతో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘అంశాల స్వామి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఫ్లోరోసిస్ బాధితుల కోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యం. స్వామి ఎందరికో ప్రేరణగా నిలిచారు. ఆయన ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే గతంలో స్వామితో కలిసి భోజనం చేసిన ఫొటోను ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వామి మృతి పట్ల శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సంతాపం
అంశాల స్వామి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సామాజిక సమస్యగా మారిన ఫ్లోరోసిస్ పేరు గుర్తుకు రాగానే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు అంశాల స్వామి అని సీఎం పేర్కొన్నారు. మానవీయ కోణాన్ని తట్టిలేపుతూ తెలంగాణ ఉద్యమంలో అంశాల స్వామి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పానికి.. ఫ్లోరోసిస్ బాధితులైన అంశాల స్వామి వంటి వారే ప్రేరణగా నిలిచారని సీఎం చెప్పారు. స్వామి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
స్వామికి పెద్దన్నలా మంత్రి కేటీఆర్
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామికి మంత్రి కేటీఆర్ పెద్దన్నలా చివరి వరకూ అండగా నిలిచారు. ఫ్లోరైడ్ విముక్తి ఉద్యమంలో ఉన్న అంశాల స్వామితో కేటీఆర్కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. స్వరాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాలో భాగంగా స్వామి ఇంటికి శుద్ధమైన తాగునీరు వచ్చింది. స్వామి ఇల్లు శిథిలావస్థలో ఉండడంతో కేటీఆర్ చలించిపోయారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయించారు. సెలూన్ కూడా ఏర్పాటు చేయించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బీఆర్ఎస్ స్థానిక నేత కర్నాటి విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించి గతేడాది ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. ఇటీవల మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ దాఖలు రోజున శివన్నగూడెంలోని అంశాల స్వామి కొత్త ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఆయన ఇంట్లో కేటీఆర్ స్వయంగా వడ్డించి మంత్రి జగదీశ్రెడ్డి, అంశాల స్వామితో కలిసి భోజనం చేశారు. యోగక్షేమాలు తెలుసుకొని భరోసా ఇచ్చారు.