Kadem Project | నిర్మల్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. శుక్రవారం ఉదయం నుంచి వరద ఉధృతి పెరిగింది. లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో రావడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు.. ఒక్కొక్కటిగా ఇప్పటి వరకు 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 1,69,300 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు 1,47,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.575 అడుగులు కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 6.738 టీఎంసీలుగా ఉంది.
కడెం ప్రాజెక్టును నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలతో కొన్ని వరద గేట్లు తెరుచుకోలేదని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, సాంకేతిక నిపుణులను రప్పించి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.