హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో వచ్చి, పోయే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నది. బేగంపేట విమానాశ్రయానికి గతంలో వారానికి నాలుగైదు ప్రత్యేక విమానాలు మాత్రమే రాగా ఇప్పుడు వాటి సంఖ్య 30 వరకు ఉంటున్నది. బేగంపేట విమానాశ్రయంలో ఒకేసారి 22 విమానాలను పార్కింగ్ చేసే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో నాలుగైదు విమానాలను మాత్రమే బేగంపేటలో పార్కింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు విమానాల పార్కింగ్ స్థలం నిండిపోతున్నది. హైదరాబాద్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన దవాఖానాలు ఉండటంతో ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి వారానికి కనీసం 6 నుంచి 8 ఎయిర్ అంబులెన్స్లు వస్తున్నాయి.
తమకు అనువైన సమయంలో, అనువైన రోజున వెళ్లడానికి ప్రత్యేక విమానాలు సౌకర్యవంతంగా ఉండటంతో సినీ రంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలవారు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లో విస్తరించిన అంతర్జాతీయ స్థాయి ఫార్మా, ఐటీ కంపెనీల ప్రతినిధులు వివిధ వ్యాపార ఒప్పందాలు, అవగాహనలు, లావాదేవీల నిమిత్తం ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. దీనికితోడు టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, పెట్టుబడుల ఆకర్షణ తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి కూడా హైదరాబాద్కు ప్రత్యేక విమానాల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలనుకొనే వారు అందుకు సంబంధించిన పనుల నిమిత్తం ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏవియేషన్ టైర్బెన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) పై వ్యాట్ను 16 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించడం కూడా రాష్ట్రంలో ప్రత్యేక విమానయాన సర్వీసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. దేశంలోని ఇతర నగరాలతో పోల్చుకొంటే భౌగోళికంగా, వాతావరణ పరంగా అత్యంత అనువైన ప్రాంతం కావడంతో హైదరాబాద్లో పార్కింగ్ చేయడానికి విమానయాన సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సినిమా షూటింగ్లు, ప్రమోషన్ వర్క్లలో పాల్గొనడానికి తెలుగు సినీరంగ ప్రముఖులతో పాటు దేశంలోని అగ్రతారలు ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక విమానాలను తీసుకొని విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, తిరుపతి తదితర పట్టణాలకు వెళ్లివస్తున్నారు. ఏపీకి చెందిన ప్రముఖుల కుటుంబసభ్యుల వివాహాలు, శుభకార్యాలను హైదరాబాద్లోనే ఎక్కువగా నిర్వహిస్తుండటం కూడా ప్రత్యేక విమానాలకు గిరాకీ పెంచుతున్నది. తిరుపతికి, షిర్డీ తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలకు కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఇటీవల పెరిగింది. ఆరు, ఎనిమిది సీట్లు ఉండే ప్రత్యేక విమానాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, హైదరాబాద్లోని భారీ పరిశ్రమలు, విమానయానానికి అనువైన వాతావరణం తదితర కారణాలతో ప్రత్యేక విమానాలకు డిమాండ్ పెరిగింది. ఏవియేషన్ ఫ్యూయల్ చార్జీలపై వ్యాట్ను ప్రభుత్వం తగ్గించింది. ఇలా అనేక రకాల కారణాలతో హైదరాబాద్కు ప్రత్యేక విమానాల్లో వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. బేగంపేటలో గతంలో నాలుగైదు విమానాల పార్కింగ్ కు మాత్రమే డిమాండ్ ఉండేది. ఇప్పుడు పార్కింగ్ ఫుల్ అవుతున్నది.
– వీఎన్ భరత్రెడ్డి, తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్