ఖమ్మం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఖమ్మానికి చెందిన నేతల మధ్య వివాదం చోటుచేసుకున్నది. ఖమ్మం నగరంతోపాటు సభావేదిక స్థలమైన ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఫొటో లేకపోవడంపై హైదరాబాద్, హుజూరాబాద్ నేతలు సభా స్థలి వద్ద గొడవ చేశారు.
దీంతో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆదివారం ఉదయంలోపు ఈటల ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేత రాష్ట్ర పర్యటనకు వస్తుంటే.. ఏర్పాట్లను చేయాల్సిన నాయకులు.. ఇలా తగవులాడుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.