జహీరాబాద్, ఆగస్టు 15: కర్ణాటకలోని బీదర్ జిల్లాలో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మృతులంతా హైదరాబాద్ వారే. బీదర్ జిల్లా మన్నెల్లి సీఐ శ్రీకాంత్, జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సైబర్ క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న గిరిధర్ మరో పది మందితో కలిసి గుల్బర్గా జిల్లా గానుగాపూర్లో దత్తాత్రేయస్వామి దర్శనానికి కారులో వెళ్తున్నారు.
బీదర్ జిల్లా బొంగూరు ఫ్లై ఓవర్ వద్ద వీరి కారు అదుపు తప్పి ఎదురుగా వెళుతున్న కంటైనర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి దవాఖానకు తీసుకెళ్తుండగా మృతి చెందారు. కారులో ఉన్న మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతులను గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేశ్ (2), డైవర్ జగదీశ్ (35)గా గుర్తించారు. గాయపడిన గీత, రజిత, ప్రభావత్, షాలిని, హర్షవర్ధన్ బీదర్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మన్నల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో ప్రమాదం
తెలంగాణ సరిహద్దుకు 2 కి.మీ. దూరం లోని బొంగూర్ ఫ్లై ఓవర్ మీద ఈ ప్రమాదం జరిగింది. బాధితులు హైదరాబాద్కు చెందినవారు కావడంతో జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్ వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
గిరిధర్ ఇంట్లో విషాధఛాయలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన గిరిధర్ గోగి (50) ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి. గిరిధర్ మొఘల్పురా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. నాగోల్ జైపూర్ కాలనీలో భాగ్య ఎన్క్లేవ్ ఫ్లాట్ నం.307లో నివాసం ఉండే గిరిధర్కు భార్య జ్యోతి కుమారులు రాహుల్, సుదర్శన్, తల్లి ప్రమీల ఉన్నారు. సోమవారం ఉదయం జెండా వందనం తర్వాత ఫ్రెండ్స్తో కలిసి గానుగాపూర్కు టూర్ వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. సాయంత్రం కుటుంబ సభ్యులకు ఘటన వివరాలు తెలిశాయి. కాగా గిరిధర్ ఎవరితో వెళ్లారో కుటుంబసభ్యులకు ఇంకా తెలియకపోవడం గమనార్హం.