TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 85.48 శాతం మంది విద్యార్థులు సీట్లు పొందారు. మూడు యూనివర్సిటీలు, 28 ప్రయివేటు కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండాయని అధికారులు పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో 85.12 శాతం, ప్రయివేటు యూనివర్సిటీల్లో 75.08 శాతం, ప్రయివేటు కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. మొత్తం 82,666 ఇంజినీరింగ్ సీట్లు ఉండగా, ఫస్ట్ ఫేజ్లో 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.20 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 44.09 శాతం, ఇతర ఇంజినీరింగ్ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో పేర్కొన్న ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్ అవుతుంది. అయితే ట్యూషన్ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11వ తేదీ మధ్యలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.