హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కంటి చూపులేని వారి కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ముద్రించిందని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కంటి చూపులేని వారికి కూడా ఈ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో భాగంగానే బ్రెయిలీ లిపిలో ముద్రించినట్టు తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణతో కలిసి బ్రెయిలీ లిపిలో ముద్రించిన మున్సిపల్ చట్టం- 2019 పుస్తకాన్ని కేటీఆర్ ఆవిషరించారు. రాష్ట్రంలో రోజువారీ వ్యవహారాల్లో అనేక మందికి మున్సిపల్ చట్టం అవసరం ఉంటుందని, ఈ నేపథ్యంలో కంటి చూపు లేని వారి కోసం బ్రెయిలీ లిపిలో ముద్రించామని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్రెయిలీ లిపిలో ముద్రించినందుకు మున్సిపల్శాఖ సీడీఏంఎ ఎన్ సత్యనారాయణ, ఇతర అధికారులను కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి ఆదర్శంగా, పారదర్శకంగా ఉండేలా మున్సిపల్ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని, ఆసరా పింఛన్ కింద వారికి నెలకు రూ.3,016 ఇస్తున్నదని గుర్తుచేశారు. దీంతోపాటు మూడు చక్రాల వాహనాలు, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు ఇచ్చామని వివరించారు. దివ్యాంగుల కోసం మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మున్సిపల్ చట్టం తెలుగు, ఇంగ్లిష్లో ముద్రించామని తెలిపారు. ఉద్యోగులు, ఉద్యోగులు కానీ వారు సులభంగా ఉపయోగించుకొనేలా దీనిని ముద్రించామని, వారి సందేహాలు, సమస్యలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్రావు, మాగంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.