హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదస్థలికి అగ్నిమాపక శకటాలను పంపేలా అగ్నిమాపకశాఖ అత్యాధునిక టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం 201 అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ను ఏర్పాటుచేసి ‘కైట్ ఐ’ అనే యాప్తో అనుసంధానించారు. ఈ యాప్ ద్వారా శాఖలోని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఫైర్మెన్ వరకు సమాచారాన్ని రియల్టైంలో పంచుకోవచ్చు. కైట్ ఐ విధానాన్ని తొలుత జీహెచ్ఎంసీలో 61 అగ్నిమాపక శకటాలను జీపీఎస్తో అనుసంధానించి విజయవంతంగా పరిశీలించారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినట్టు రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తెలిపారు.
క్షణాల్లో అప్రమత్తం
అగ్ని ప్రమాదం జరిగినట్టు 101 లేదా డయల్ 100 ద్వారా బాధితులు ఇచ్చే సమాచారం తొలుత సికింద్రాబాద్లోని అగ్నిమాపకశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. అక్కడి సిబ్బంది బాధితుల నుంచి ప్రమాద స్థలం, పేరు, ఫోన్ నంబర్ తీసుకొని ఆ అడ్రస్ను కైట్ ఐ యాప్లో నమోదు చేస్తారు. ప్రమాదస్థలికి దగ్గరలో ఎన్ని అగ్నిమాపక శకటాలు ఉన్నాయి? వాటిలో ఏది స్పాట్కు త్వరగా చేరుకోగలదు అన్నది కంట్రోల్ రూం తెరపై (ఆన్లైన్లో ట్యాక్సీ సర్వీస్ మాదిరిగా) కనిపిస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న ఫైర్ టెండర్ సిబ్బందికి సమాచారం ఇస్తారు. ఇదే సమయంలో ఆ ప్రాంత పరిధిలోని ఫైర్ స్టేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, జిల్లా ఫైర్ ఆఫీసర్, రీజినల్ ఫైర్ ఆఫీసర్కు సైతం అలర్ట్ వెళ్తుంది. ప్రమాద స్థలికి బయలు దేరిన వాహనంలోని ఫైర్ ఆఫీసర్ పేరు, ఫోన్ నంబర్ అధికారులతోపాటు బాధితులకు కూడా వెళ్తుంది. ఆ అధికారితో బాధితులు నేరుగా సంభాషించే వీలుంటుంది. జీపీఎస్ విధానం వల్ల ప్రతి కదలిక సమయంతో సహా రికార్డవుతుంది. అగ్నిమాపక శకటాల సిబ్బంది మొబైల్ ఫోన్ల లో కూడా కైట్ ఐ యాప్ ఉంటుంది. దాంతో ప్రమాద స్థలికి దగ్గరి దారిని వారు మ్యాప్లో చూసుకొనే వీలు కలుగుతుంది.
ప్రతి కదలిక చూడొచ్చు
రాష్ట్రంలోని అన్ని అగ్నిమాపక శకటాలకు జీపీఎస్ ఏర్పాటుచేసి కైట్ ఐ యాప్తో అనుసంధానించాం. కంట్రోల్ రూం తెరపైన ప్రతి వాహనం కదలికను మేం రియల్ టైంలో చూడవచ్చు. కంట్రోల్ రూంకు ప్రమాద సమాచారం రాగానే మాకు కూడా అలర్ట్ వస్తుంది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేయచ్చు. ప్రతి కదలిక టైంతో సహా రికార్డవుతుంది కాబట్టి సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రజల్లో భరోసా పెరుగుతుంది.
-పాపయ్య, రీజినల్ ఫైర్ ఆఫీసర్, సెంట్రల్ రీజియన్