మొగుళ్లపల్లి, మే 1 : పంట చేతికొచ్చే దశలో అగ్ని ప్రమాదంతో 18 ఎకరాల్లో మక్కజొన్న చేను దగ్ధమైన ఘటన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఎల్లారెడ్డిపల్లిలో మక్కజొన్న చేన్లకు మంటలు అంటుకుని వ్యాపించాయి. గమనించిన రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు.
అప్పటికే 18 ఎకరాల్లో పంట కాలిబూడిదైంది. ఈ ఘటనలో పెండ్లి మల్లయ్యకు చెందిన ఆరు ఎకరాలు, పెండ్లి దేవేందర్, గోనె శ్రీనివాస్, కూస కొమురయ్యకు చెందిన రెండు ఎకరాల చొప్పున, మొర్రి ఐలయ్యకు చెందిన 1.20 ఎకరాలతోపాటు మరికొంత మక్కజొన్న పంట కాలిపోయింది. ఘటనాస్థలిని తహసీల్దార్ సునీత, ఎంపీడీవో సురేందర్గౌడ్, ఏఈవో మాళవిక పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టం జరగడంతో ప్రభుత్వం సాయం చేయాలని రైతులు కోరారు.