హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన జిమ్లను ఓపెన్ జిమ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కలుగుతున్నది. ప్రైవేట్ జిమ్లకు వెళ్లే స్థోమత లేనివారికి ఇవి వరంగా మారుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 443 జిమ్లను నిర్వహిస్తున్నది. ఇందులో మున్సిపాలిటీలలో 93, కార్పొరేషన్లలో 369 ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 74 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడం విశేషం. ఇవి ఉచితంగా అందుబాటులోకి రావడం, నిర్వహణ మెరుగ్గా ఉండటం, పార్కుల సమీపంలో, ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాటు చేయడంతో ప్రజలు వీటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మరిన్ని ఓపెన్ జిమ్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే అధికారులు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నారు. జిమ్ల ఏర్పాటుకు పట్టణ, పల్లెప్రగతి నిధులను వినియోగిస్తున్నారు.