హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మత్స్యకారుల కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా రెండు రకాలుగా ఆర్థిక సాయం అందిస్తున్నది. మత్స్య సొసైటీలో సభ్యుడైన మత్స్యకారుడు దురదృష్టవశాత్తు చేపలు పట్టే క్రమంలో లేదా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నది. మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి రూ.9 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నది. ఇందులో రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా, రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా కింద అందజేస్తున్నది. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నది. తక్కువ అంగవైకల్యం కలిగినవారికి రూ.2.5 లక్షలు, దవాఖాన ఖర్చులకు రూ.25 వేలు అందజేస్తున్నది. ఇందుకు సంబంధించి ఏటా మత్స్యకారులకు ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ చేయిస్తున్నది. 2022- 23 ఏడాదికి ప్రభుత్వం 3.60 లక్షల మంది మత్స్యకారులకు ఇన్సూరెన్స్ చేయించేందుకు రూ.88.97 లక్షల మొత్తాన్ని చెల్లించింది. సొసైటీ సభ్యులైన 18 నుంచి 70 ఏండ్ల వయసువారికి ఇన్సూరెన్స్ వర్తింప జేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు విధానాలతో 2020-21 వరకు ఇన్సూరెన్స్ మొత్తం రూ.2 లక్షలే ఉండేది. తక్కువ వైకల్యం ఏర్పడితే రూ.లక్ష మాత్రమే ఇచ్చేవారు. చిన్నచిన్న గాయాలతో దవాఖానపాలైనవారికి నయా పైసా కూడా ఇచ్చేవారు కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్యశాఖ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి ఇన్సూరెన్స్ పరిహారాన్ని పెంచేలా చేసింది. ఇన్సూరెన్స్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది. దీంతో పట్టుబట్టి మరీ ఇన్సూరెన్స్ పరిహారాన్ని పెంచేలా చేసింది. 2021-22 నుంచి కొత్త పాలసీ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం వ్యక్తి మరణిస్తే గతంలో రూ.2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచేలా చేసింది. తక్కువ అంగవైకల్యం ఏర్పడినవారికి రూ.లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచేలా చేసింది. దీనికి తోడు గాయాలతో దవాఖానపాలైతే ఖర్చుల కోసం రూ.25 వేలు ఇప్పించేలా చేసింది. గత నిబంధనల ప్రకారం రాష్ట్రం ఇచ్చే ఎక్స్గ్రేషియా రూ.4 లక్షలు, కేంద్రం, రాష్ట్రం వాటా కింద ఇచ్చే ఇన్సూరెన్స్ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఇన్సూరెన్స్ మొత్తం పెరగడంతో రూ.9 లక్షలు అందుతున్నాయి.
ఇన్సూరెన్స్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నది. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కేంద్రంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్స్గ్రేషియాను అమలు చేస్తున్నది. దీని ద్వారా ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి రూ.4 లక్షల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తున్నది. కేంద్రం వాటా గల ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం రూ.2 లక్షలే ఉండటంతో మత్స్యకార కుటుంబానికి పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంబంధం లేకుండా సొంతంగానే మత్స్యకార కుటుంబానికి సాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.4 లక్షల ఎక్స్గ్రేషియాను అమలు చేశారు.
ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ఇంత మంచి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ దీనిపై మెజారిటీ మత్స్యకారులకు అవగాహన లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియాపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే త్వరలోనే క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నది. ప్రతి సొసైటీకి వెళ్లి వారి విధులు, హక్కులు, ప్రయోజనాలను వివరించనున్నది.
మత్స్యకారులకు చెరువుల లీజు కష్టాలు తీరనున్నాయి. లీజు విధానాన్ని మరింత సులభతరంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ‘మత్స్యసేవ’ పేరుతో ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. ఈ మేరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), మీ-సేవతో ఒప్పందం కుదుర్చుకొన్నది. గతంలో గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. చెరువులను లీజుకు తీసుకోవాలనుకొనే సొసైటీల ప్రతినిధులు ఇకపై అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకొని, లీజు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ఏ ఫైల్ ఎవరి వద్ద ఎన్ని, రోజులు పెండింగ్లో ఉన్నదో మత్స్యసేవ పోర్టల్ ద్వారా సులభంగా తెలిసిపోతుంది. తద్వారా ఫైళ్లు వేగంగా కదిలి రోజుల వ్యవధిలోనే లీజుల కేటాయింపు పూర్తవుతుంది. ఈ విధానంలో ప్రతి చెరువుకు పక్కాగా లీజు వసూలవుతుంది. అంతేకాకుండా ఆ లీజు మొత్తంలో గ్రామ పంచాయతీకి దక్కాల్సిన వాటా సకాలంలో అందుతుంది. ప్రస్తుతం మత్స్యశాఖ పరిధిలో 25 వేలకుపైగా చెరువులున్నాయి. మిషన్ కాకతీయతో అవన్నీ జలకళను సంతరించుకొని మత్స్య సంపదకు నెలవుగా మారాయి.
చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణం, ఎన్ని రోజులు నీరు నిల్వ ఉంటుందనే గణాంకాల ఆధారంగా లీజులను నిర్ణయించారు. 100 ఎకరాలకు కంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను 3 రకాలుగా విభజించారు. సంవత్సరమంతా నీరు నిల్వ ఉండే పెరిన్నియల్ ట్యాంక్స్కు రూ.400 (హెక్టారుకు), 6 నుంచి 10 నెలలపాటు నీరు ఉండే లాంగ్ సీజనల్ ట్యాంక్స్కు రూ.200, 6 నెలల వరకు నీరు నిల్వ ఉండే షార్ట్ సీజనల్ ట్యాంక్స్కు రూ.60 చొప్పున లీజు వసూలు చేస్తారు. ఆయకట్టు విస్తీర్ణం 100 ఎకరాలకుపైగా ఉన్న చెరువులకు లీజు విధానం మరోలా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,500 చెరువులు ఈ జాబితాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీటికి ఏటా రూ.లక్షల్లో లీజు చెల్లించాల్సి ఉంటుంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్కు రూ.2.65 లక్షలు, అదే జిల్లాలోని యాద్గారిపల్లి చెరువుకు రూ.1.99 లక్షలుగా నిర్ణయించారు. ఇలాంటి చెరువుల లీజును ఐదేండ్లకోసారి 5% చొప్పున పెంచుతారు. ఈ చెరువుల నుంచి వసూలయ్యే లీజు మొత్తంలో 30% సదరు గ్రామ పంచాయతీకి, 50% నీటి సొసైటీకి, మిగిలిన 20% మత్స్యశాఖకు వెళ్తుంది.