హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితజాతి స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం ఓ సంచలనమని సాంఘి క సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పథకం ద్వారా లబ్ధిదారులు ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారని, అది సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. దళితబంధు పథకం రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితుల ఉపాధి కోసం 100 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల గ్రాంటును ప్రభుత్వం అందివ్వడం చరిత్రాత్మకమని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 38 వేల మందికిపైగా లబ్ధి పొందారని వివరించారు. రెండో విడత త్వరలోనే ప్రారంభం కానున్నదని, అందుకోసం 2023-24 బడ్జెట్లో 17,700 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.