సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం బోట్లో ప్రయాణిస్తూ సద్దుల బతుకమ్మ పండుగను తిలకించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న కోమటి చెరువు అభివృద్ధి నచ్చిందా? అని ప్రజలను ప్రశ్నించారు.
ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా కోమటి చెరువులో మ్యూజికల్ లేజర్ మౌంటెయిన్ షో, గ్లో గార్డెన్ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్నారు. బతుకమ్మ పండుగ ఆడపడుచుల ఆనందానికి సంకేతమని, ప్రపంచంలోనే అత్యంత అరుదైన గౌరవం పొందిన ఈ బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని తెలిపారు. తెలంగాణ గొప్ప సంస్కృతి సంప్రదాయాలు గల ప్రాంతమని, పూలను ప్రకృతిని దైవంగా పూజించే సంస్కృతి తెలంగాణకు మాత్రమే ఉందని అన్నారు.
కోమటి చెరువు అభివృద్ధి చేసిన తర్వాత ఆ అభివృద్ధిని చూడడానికి కనీసం రెండు గంటలు పడుతుందని తెలియజేశారు. ప్రజలు ఏవైపు వచ్చినవారు ఆ వైపు మాత్రమే చూసి వెళ్లిపోతున్నారని, పండుగ రద్దీ తగ్గిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి గ్లో గార్డెన్, మ్యూజికల్ ఫౌంటెన్ చూడాలని ప్రజలను కోరారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజల అభివృద్ధే తమ ప్రథమ ప్రాధాన్యతగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.