హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగ నియామకాలకు తుది రాత పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఖరారు చేసింది. ఈ నెల 5న పోలీసు అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాత పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్ఎల్పీఆర్బీ సిద్ధమైంది. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్పోర్టు, ఎస్సై, ఫింగర్ ప్రింటింగ్ విభాగాల అభ్యర్థులకు మొదటి రెండు పేపర్ల పరీక్షలు నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, రీజనింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లిష్ పరీక్ష జరుగనున్నది. ఏప్రిల్ 9న కేవలం సివిల్ ఎస్సై పోస్టుల అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మూడో పేపర్ జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు.
మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, మధ్యాహ్నం ఫింగర్ ప్రింటింగ్ ఏఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరుగనున్నది. మార్చి 26న ఉదయం ఎస్సై ట్రాన్స్పోర్ట్ టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు టెక్నికల్ పరీక్ష ఉంటుంది. ఈ టెక్నికల్ పరీక్షలను కేవలం హైదరాబాద్లోనే నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది. ఫైనల్ పరీక్షలను రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొన్నది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్ల డౌన్లోడ్, డ్రైవింగ్ టెస్టుల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.