ముషీరాబాద్, మార్చి 11: కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇందుకు ఢిల్లీ ముట్టడికి పిలుపు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి ఎంపీలు కూడా పోరాడాలని కోరారు. శుక్రవారం విద్యానగర్లోని బీసీ భవన్లో జరిగిన నిరుద్యోగ జేఏసీ సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. 80 వేల ఉద్యోగాల నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం చారిత్రాత్మకమని కొనియాడారు. పదేండ్ల వయోపరిమితి సడలింపు హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, అనంతయ్య, కృష్ణయాదవ్, అరవింద్ స్వామి, వెంకటేశ్యాదవ్ పాల్గొన్నారు.