హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని నిలువరించడానికి ప్రభుత్వం వేసిన షట్చక్ర బంధనం విజయవంతమవుతున్నది. సమయానుకూలంగా తీసుకొంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న వ్యూహాలతో వచ్చే నెలాఖరుకల్లా వైరస్ వ్యాప్తిలో 90 శాతం క్షీణత కనిపిస్తుందని వివిధ అధ్యయన సంస్థలు చేసిన నమూనా గణాంకాలు వాస్తవ గణాంకాలను అచ్చంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటికే కొత్త కేసులు రావడం తగ్గిపోయింది. పాజిటివిటీరేటు సైతం 5శాతం దిగువకు పడిపోయింది. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. సెకండ్ వేవ్ ఉద్ధృతి మొదలైన దాదాపు నెలరోజుల్లోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరంచెల వ్యూహాన్ని అమలుచేసింది. పలు శాస్త్రీయ అధ్యయనాల్లో సైతం ఈ విషయం స్పష్టంగా నిర్ధారణ అయింది. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు గణితశాస్త్ర సిద్ధాంతపరంగా అభివృద్ధిచేసిన ‘సూత్ర’ ప్రకారం జూన్ చివరికల్లా దేశంలోనే కరోనా క్షీణిస్తుందని, తెలంగాణలో మే నెలాఖరుకే రోజూవారి కొత్త కేసుల్లో 90 శాతం క్షీణత కనిపిస్తుందని తేల్చింది. విశేషమేమిటంటే.. సూత్ర మోడల్ కంప్యూటెడ్ గణాంకాలు.. తెలంగాణలో వాస్తవ గణాంకాలకు అతి దగ్గరగా ఉండటం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వైద్య వ్యవస్థను పటిష్ఠం చేసుకొంటూ.. బహుముఖాలుగా చర్యలు తీసుకోవడం వల్లనే కొవిడ్ కట్టడి సాధ్యపడుతున్నది.
రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సమగ్ర చికిత్స అందిస్తున్నది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నవారిని ఇంట్లోనే ఉంచి ప్రత్యేక మెడికల్ కిట్ ఇస్తున్నది. మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేర్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నది. పాజిటివ్ వచ్చినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించి (ట్రేసింగ్) చికిత్స ఇస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రికవరీ రేటు సుమారు 93 శాతంగా నమోదైంది. 5.18 లక్షల మంది విజయవంతంగా కరోనా నుంచి కోలుకున్నారు. మొదటివేవ్తో పోల్చితే సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీర్చేందుకు దేశంలోనే మొదటిసారిగా ఆక్సిజన్ ట్యాంకర్లను ఎయిర్ లిఫ్ట్ చేసింది.
వ్యాధి ముదరకముందే ఇండ్ల వద్దనే రోగులను గుర్తించి, వారికి చికిత్సనందించేందుకు సీఎం కేసీఆర్ ‘జ్వర సర్వే’ పేరుతో వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 6 నుంచి ఇది మొదలైంది. వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరం, ఇతర కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి కిట్లు అందజేశారు. దీంతో ప్రారంభ దశలోనే వ్యాధిని అడ్డుకోగలిగారు. జ్వర సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ర్టాలకు సూచించింది.
సెకండ్ వేవ్లో కరోనా చికిత్సకు రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్, ఫావిపిరవిర్ వంటివి అవసరమయ్యాయి. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఔషధాల సరఫరాను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకున్నది. కేంద్రం నుంచి తెలంగాణకు సంపూర్ణ సహకారం అందలేదు. దీంతో మంత్రి కేటీఆర్ ఔషధ తయారీ సంస్థలతో మాట్లాడి ఉత్పత్తిని పెంచేలా కృషిచేశారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన అన్ని ఔషధాలను అందుబాటులో ఉంచారు. కోట్ల సంఖ్యలో ట్యాబ్లెట్లను, లక్షల వయల్స్ను కొనుగోలు చేశారు.
ఇది పంట చేతికొచ్చే కాలం. ధాన్యం క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో రైతులు, వ్యాపారులు, కూలీలు, డ్రైవర్లు, అధికారులు.. ఇలా లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. వీరి ద్వారా వ్యాధి వ్యాపించే (సైలెంట్ స్ప్రెడర్స్) అవకాశాలు ఉంటాయి. దీనిని ముందస్తుగానే ఊహించిన ప్రభుత్వం ఊర్లల్లోనే ధాన్యం కొంటామని ప్రకటించింది. సుమారు 6,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో రైతులు, కూలీలు, వ్యాపారులు తిరుగడం తగ్గి.. వ్యాధి వ్యాప్తి అదుపులోకి వచ్చింది.
కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించింది. ప్రజలు ఇండ్లకే పరిమితం కావడం, కార్యకలాపాలు ఆగిపోవడంతో వైరస్ వ్యాప్తి తగ్గింది. సాధారణంగా ఒక వ్యక్తికి కొవిడ్ వైరస్ సోకితే 12-15 రోజుల్లో తగ్గిపోతుందని, శరీరంలోని వైరస్ చనిపోతుందని శాస్త్రీయ అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే రోగులు 12-15 రోజులు ఇంటికే పరిమితం అయితే వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమై మంగళవారానికి 14 రోజులు గడిచింది. లాక్డౌన్కు ముందుతో పోల్చితే రెండు వారాల్లోనే కేసుల సంఖ్య 30 శాతానికిపైగా తగ్గాయి.
ప్రజలకు టీకాలు అందించడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నది. హైదరాబాద్ వంటి నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగింది. దీంతో గ్రామాల్లో కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో ఉన్నది. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు సుమారు 1.41 లక్షల మందికి ఇప్పటికే టీకాలు వేశారు. జాతీయ సగటు 1.29 లక్షలు ఉండగా, ఏపీలో 1.39 లక్షలు, తమిళనాడులో 87 వేలు, యూపీలో 61వేలు మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో రోజుకు 9 లక్షల మందికి టీకాలు వేయగలిగే సామర్థ్యం ఉన్నది. కేంద్రం నుంచి టీకాలు సరిపడా సరఫరా కాలేదు. దీంతో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగింది.
కరోనాపై గెలువాలంటే ప్రభుత్వమో.. ప్రజలో ఒంటరి పోరు చేస్తే సరిపోదు. సమిష్టిగా పోరాడితేనే విజయం సాధ్యం అవుతుంది. మొదటి వేవ్లోనే ఇది స్పష్టమైంది. కేసుల కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తే.. ప్రజలు సంపూర్ణంగా సహకరించారు. ప్రజలకు ఆర్థిక నష్టం కలుగడంతో ప్రభుత్వం అనేక రూపాల్లో వారిని ఆదుకున్నది. ఇప్పుడు సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలోనూ అదే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాల్సి ఉంటుంది. సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే ప్రజలు, ప్రభుత్వం మరో రెండు మూడు వారాలు సమిష్టి పోరాటం చేయాల్సి ఉంటుంది.
‘సూత్ర’ ఇది ఒక మ్యాథమెటికల్ మోడల్. ఐఐటీ కాన్పూర్కు చెందిన ఎం అగర్వాల్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కు చెందిన ఎం కనిట్కర్, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఎం విద్యాసాగర్ కొవిడ్ మహమ్మారి వ్యాప్తి.. క్షీణతలు, మరణాల హెచ్చుతగ్గులపై సూత్ర అనే ఒక మ్యాథమెటికల్ మోడల్ను రూపొందించారు. ససెప్టిబుల్, అన్డిటెక్టెడ్, టెస్టెడ్, రిమూవ్డ్ అప్రోచ్ల సంక్షిప్త నామంగా సూత్ర అన్న మోడల్ను ఖరారుచేశారు. కరోనా కేసులు.. లక్షణాలు ఉన్నవారు.. లేనివారు, రోజూవారీ కేసుల సరళి.. వాప్తి తీవ్రతను.. కొవిడ్19 పై ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో పొందుపరచిన సమాచారం ఆధారంగా అధ్యయనం చేశారు. దీని ప్రకారం జూన్ మొదటివారానికి తెలంగాణలో రోజూవారి కేసులు వెయ్యికి పడిపోతాయని నిర్ధారణకు వచ్చారు. జూన్ నెలాఖరుకు రోజూవారీ కొత్త కేసులు 90 శాతం పడిపోతాయని అంచనాకు వచ్చారు.
ఆశ్చర్యమేమిటంటే.. ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్ వేసిన గణాంకాలు.. సింగపూర్ యూనివర్సిటీ భారత్తో సహా 131 దేశాల్లో చేసిన సర్వే, పరిశోధనల గణాంకాలతో అతి దగ్గరగా సరిపోలాయి. సింగపూర్ యూనివర్సిటీ పరిశోధకులు సైతం జూన్ రెండోవారం తరువాత భారతదేశం 97 శాతం కొవిడ్ ఫ్రీ అవుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్ సూత్ర మోడల్ అదే చెప్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల వ్యూహం సత్ఫలితాలు ఇస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఐటీ కాన్పూర్ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో ఈ నెలాఖరుకు కొత్త కేసులు 90 శాతం తగ్గుతాయని, జూన్ నెలాఖరుకు 95 శాతం తగ్గుతాయని తెలిపింది. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు రాష్ట్రంలో కొన్ని నెలలుగా నమోదవుతున్న కేసులు, వైరస్ వ్యాప్తి, మరణాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కృత్రిమ మేధ సాయంతో వైరస్ ఉద్ధృతిని అంచనా వేశారు. గణిత శాస్త్రం ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ విధానానికి ‘సూత్ర’ అని పేరుపెట్టారు. ఈ అధ్యయనానికి ఐఐటీ కాన్పూర్కు చెందిన ఎం అగర్వాల్ నేతృత్వం వహించగా, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ ఎం విద్యాసాగర్ భాగస్వామి అయ్యారు.