హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పంట వ్యర్థాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. అందులో భాగంగా వాటితో సహజ సిద్ధమైన ఎరువు (బయోచార్)ను తయారు చేసి భూసారాన్ని పెంపొందించే విధానాన్ని అభివృద్ధి చేసింది. పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడానికి బదులుగా వాటిని ప్రత్యే ఉష్ణోగ్రత వద్ద భూమి లోపలే కాల్చడం వల్ల వచ్చే పదార్థాన్ని బయోచార్ అంటారు.
ఈ విధానంతో భూసారం పెరగడంతోపాటు పంట వ్యర్థాలు, నీటి కాలుష్యం గణనీయంగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బయోచార్ తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు 2017లో ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇవి ఏటేటా 10-15 శాతం పెరుగుతున్నట్టు పేర్కొన్నది. దీంతో వాతావరణంలో కార్బన్, గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం నానాటికీ అధికమవుతున్నది. ఈ నేపథ్యంలో బయోచార్ తయారీని ప్రోత్సహిస్తే వ్యవసాయ వ్యర్థాలు తగ్గడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం కూడా సమకురుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.