Telangana | కోటపల్లి, డిసెంబర్ 9 : మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. వెంచపల్లి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీలత శుక్రవారం కార్యాలయం నుంచి వెంచపల్లిలోని తన క్వార్టర్స్కు చేరుకున్నారు. రాత్రి సమయంలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకోగా.. గమనించిన భర్త రాజేశ్ వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు శ్రీలత తెలిపారు. వెంచపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో బీహార్ కూలీలతో ప్లాంటేషన్ పనులు చేయిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. డబ్బులు చెల్లించాలని బీహార్ లేబర్ కోరగా, ఉన్నతాధికారులు చెల్లిస్తారని శ్రీలత చెప్పారు.
డబ్బుల జాప్యంపై కూలీల బృందం సభ్యుడు జిల్లా అటవీ సంరక్షణాధికారి దృష్టికి తీసుకెళ్లాడు. కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని సంబంధిత అధికారి ఆదేశించారు. ఈ విషయమై మాట్లాడేందుకు తన కార్యాలయానికి రావాలని శుక్రవారం శ్రీలతకు కోటపల్లి రేంజర్ రవి ఫోన్ చేశారు. సాయంత్రమైనా రేంజర్ కార్యాలయానికి రాకపోవడంతో ఆమె ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా ఫోన్ చేసి, తిరిగి కార్యాలయానికి రావాలని రవి సూచించారు. దీంతో శ్రీలత తిరిగి రేంజ్ కార్యాలయానికి వెళ్లారు. ‘నీ వల్లే నాకు చెడ్డపేరు వచ్చింది. సస్పెండ్ చేస్తా’నని రేంజర్ బెదిరించినట్టు శ్రీలత తెలిపారు. ఎఫ్బీవో ఆత్మహత్యాయత్నానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని రేంజర్ రవి పేర్కొన్నారు. తాను ఎవరినీ వేధించలేదని చెప్పారు. విధులకు సంబంధించి సూచనలు చేశానే తప్ప దూషించలేదని స్పష్టం చేశారు.