హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో తెలంగాణ నుంచి రా రైస్ కాకుండా పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్ర ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ఎఫ్సీఐ చైర్మన్ అతీశ్ చంద్రను మంత్రి శుక్రవారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారని, ఇలాంటి సమయంలో వారికి కేంద్రం, ఎఫ్సీఐ అండగా నిలవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగి సీజన్లో రా రైస్ ఇవ్వలేమని తెలిపారు. ఒకవేళ ఇవ్వాలని ప్రయత్నిస్తే నూక శాతం పెరిగి లక్షల టన్నుల బియ్యం వృథాగా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేండ్ల పాటు దేశానికి అన్నం పెట్టిన తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. యాసంగిలో రా రైస్ కాకుండా పూర్తిస్థాయిలో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కోరారు. వానాకాలం సీజన్లో సుమారు 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తిచేశారు. గత యాసంగిలో ఎఫ్సీఐ తనిఖీల కారణంగా సీఎంఆర్ రైస్ అందించడంలో ఆలస్యం జరిగిందని, ఫలితంగా సుమారు రూ. 300 కోట్ల విలువైన సీఎంఆర్ ఆగిపోయిందని తెలిపారు. ఈ కోటా అందించేందుకు నెల రోజుల గడువు ఇవ్వాలని కోరారు. ఎఫ్సీఐ ద్వారా ఎదురవుతున్న సమస్యలపై మూడు రోజులుగా మంత్రి గంగుల ఢిల్లీలో వరుస భేటీలు జరిపారు. తొలుత మంత్రి కేటీఆర్తో కలిసి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి సమస్యలను విన్నవించారు. ఆ తర్వాత ఆ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను కలిశారు.