ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తుపల్లికి చెందిన సాయి భానుప్రకాశ్.. ఖమ్మంలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న ఫ్రెండ్స్తో కలిసి స్కూల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. అయితే ఈ విషయమై సాయిని పాఠశాల యాజమాన్యం మందలించి స్కూలు నుంచి సస్పెండ్ చేసింది. దీంతో మనస్థాపం చెందిన సాయి.. ఈనెల 15న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ సాయి మృతిచెందాడు. దీంతో అతని తల్లిదండ్రులు సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొడుకు మృతి తట్టుకోలేక సాయి తండ్రి రాంబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.