ఇబ్రహీంపట్నం, మే 10 : జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృత్యు వాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములు (35), కుమారుడు సోను (11)తో కలిసి మోటర్ సైకిల్పై మాల్లోని సంతలో సరుకుల కొనుగోలు కోసం వెళ్తున్నారు.
తమ్మలోనిగూడ గేటు వద్ద మాల్ నుంచి ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు పెయింటింగ్ పని చేస్తూ జీవిస్తున్నాడు. రాములుతోపాటు కుమారుడు కూడా మృతి చెందడంతో స్వగ్రామం మేడిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.