వికారాబాద్ : పరిగి మండలం నస్కల్ గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, కోడలు మంగమ్మ తన ప్రియుడితో కలిసి మామ కిష్టయ్య(75)ను హత్య చేసింది. మూడేండ్ల క్రితం మంగమ్మ భర్త నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత మంగమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ విషయాన్ని గమనించిన మామ కిష్టయ్య.. కోడలిని పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన మంగమ్మ తన మామను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో మంగమ్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ప్రియుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.