Tenth Exams | కొడుకును గొప్పగా చదివించి ప్రయోజకుడిని చేయాలని ఓ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. కుమారుడి బంగారు భవిష్యత్ కోసం ఆ తండ్రి పడరాని కష్టం పడ్డాడు. జీవితానికి తొలి మెట్టు అయిన పది పరీక్షలకు బాగా చదువుకోవాలని కుమారుడికి తండ్రి పదేపదే చెప్పాడు. చదువుకుంటేనే భవిష్యత్ బిడ్డా.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని బుద్ధి మాటలు చెప్పాడు. సరిగ్గా పది పరీక్షల ప్రారంభానికి ముందే ఆ తండ్రి కన్నుమూశాడు. ఇంట్లో తండ్రి మృతదేహం ఉన్నప్పటికీ.. తండ్రి కలను సాకారం చేయాలనే సంకల్పంతో.. కుమారుడు తన దుఃఖాన్ని దిగమింగుకుని పది పరీక్షలకు( Tenth Exams ) హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభానికి ముందు తన తండ్రిని గుర్తు చేసుకుని ఆ విద్యార్థి విలపించడంతో తోటి విద్యార్థులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా( Nirmal Dist ) కడెం మండలం( Kadem Mandal ) పెద్దబెల్లాల్ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడెం గ్రామానికి చెందిన తక్కళ్ల వెంకటి(40) ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాగా ఆయన చిన్న కొడుకు తక్కళ్ల రోహిత్ సోమవారం తండ్రి మరణాన్ని దిగమింగుకొని కడెం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల( ZP High School )లో పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. కొంతకాలంగా తక్కళ్ల వెంకటి అనారోగ్యంతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు ఇటీవల నిర్మల్ దవాఖానకు( Nirmal Hospital ) తీసుకెళ్లారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ, ఆదివారం రాత్రి మృతి చెందాడు. కాగా, చిన్న కొడుకు రోహిత్ సోమవారం మొదటి రోజు పరీక్ష రాసిన అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఏడుస్తూనే రోహిత్ పరీక్షా కేంద్రానికి రాగా, తోటి మిత్రులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.